Site icon vidhaatha

చిన్న ఇబ్బంది ఎదురైనా ఎన్డీయే ప్రభుత్వ పతనం : రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: బీజేపీ సాధారణ మెజార్టీకి అవసరమైన సీట్లను గెలుచుకోని కారణంగా మనుగడ కోసం మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనేక ప్రయాసలకోర్చాల్సి ఉంటుందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రికకు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. జూన్‌ 4న ఫలితాలు వెలువడిన తర్వాత భారతదేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. భారత రాజకీయ వ్యవస్థలో ఖాళీ ఒక్కసారిగా విస్ఫోటం చెందిందని అన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అద్భుతమైన పనితీరు ప్రదర్శించి, ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను పటాపంచలు చేస్తూ 234 స్థానాలు కైవసం చేసుకున్నది. ఎన్డీయే కూటమికి 293 సీట్లు వచ్చాయి. ‘సంఖ్యలు ఎంత దుర్బలంగా ఉన్నాయంటే.. చిన్న ఇబ్బంది ఎదురైనా, ఒక భాగస్వామ్య పార్టీ నిష్క్రమించినా ప్రభుత్వం పడిపోతుంది’ అని ఆయన చెప్పారు. ‘మీరు విద్వేషాన్ని వ్యాప్తి చేయొచ్చు.. వైషమ్యాలను వ్యాప్తి చేయొచ్చు.. దాని నుంచి ఫలితాలు కూడా పొందొచ్చు. కానీ.. భారతదేశ ప్రజలు ఈ ఎన్నికల్లో ఆ ఆలోచనను తిరస్కరించారు’ అని అన్నారు. అందుకే సంకీర్ణ ప్రభుత్వం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో మోదీకి కలిసొచ్చినవి ఈసారి పనిచేయలేదని అన్నారు.

Exit mobile version