Lok Sabha Elections | న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంజినీర్ అబ్దుల్ రషీద్ షేక్ చేతిలో ఒమర్ అబ్దుల్లా ఘోర పరాజయం పాలయ్యారు.
బారాముల్లా నుంచి పోటీ చేసిన అబ్దుల్ రషీద్ 1,59,734 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో రషీద్కు ఒమర్ అబ్దుల్లా శుభాకాంక్షలు తెలిపారు. అబ్దుల్ రషీద్కు 3,50,858 ఓట్లు పోలవ్వగా, ఒమర్ అబ్ధుల్లాకు 1,91,124 ఓట్లు పోలయ్యాయి.
57 ఏళ్ల రషీద్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. యూఏపీఏ చట్టం కింద అతన్ని అరెస్టు చేశారు. స్వతంత్య్ర అభ్యర్థిగా ఈ సారి ఆయన పోటీ చేశారు. ఆయన తరపున ఇద్దరు కుమారులు విస్తృతంగా ప్రచారం చేశారు. బారాముల్లాలో అయిదో దశలో భాగంగా మే 20వ తేదీన ఎన్నికలు జరిగాయి.
అనంత్నాగ్ రాజౌరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కూడా ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి మియాన్ అల్తాఫ్ చేతిలో మెహబూబా ముఫ్తీ ఓడిపోయారు. మియాన్ అల్తాఫ్ 2,92,181 ఓట్లు రాగా, మెహబూబా ముఫ్తీకి 1,32,915 ఓట్లు పోలయ్యాయి.