Haryana assembly election । హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలు బోల్తా కొట్టాయి. ఇక్కడ కాంగ్రెస్ విజయానికి అవకాశాలు ఉన్నాయని ఎగ్జిల్ పోల్స్లో తేలినా.. బీజేపీ రికార్డు స్థాయిలో హ్యట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నది. రాష్ట్రంలోని మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 50 సీట్లలో విజయం/ ఆధిక్యం దిశగా ఉన్నది. కౌంటింగ్ మొదలైన తర్వాత కాంగ్రెస్కు ఆధిక్యం లభించినా.. తర్వాత క్రమంగా బీజేపీ పుంజుకున్నది. హర్యానాలో లోక్సభ ఎన్నికల్లో గణనీయ విజయాలు నమోదు చేసుకున్న కాంగ్రెస్.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ దానిని స్థిరపర్చుకుంటామని కన్న కలలు కల్లలయ్యాయి. తాజా లెక్కల ప్రకారం కాంగ్రెస్ 35 సీట్లలో విజయం/ ఆధిక్యంలో ఉన్నది. గతం కంటే ఏడు స్థానాలు అధికంగా గెల్చుకోగలిగినప్పటికీ మెజార్టీ మార్క్ 46కు దూరంగా నిలిచిపోయింది.
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైన మూడు గంటల తర్వాత బీజేపీ ఓటు షేర్ 38.7 శాతం ఉండగా, కాంగ్రెస్ ఓటు షేర్ 40.5 శాతంగా ఉన్నది. కానీ మధ్యాహ్నం 3.45 గంటలకు కాంగ్రెస్ ఓటింగ్ 39.05 శాతానికి పడిపోతే.. బీజేపీ షేర్ 39.89 శాతానికి పెరిగింది. ప్రభుత్వ ఏర్పాటు చేయబోయేది తామేనని కాంగ్రెస్ నేత కుమారి శెల్జ, మాజీ ముఖ్యమంత్రి హుడా చెప్పినా.. చివరకు బీజేపీ ఆధిక్యం కొనసాగింది.
వినేష్ ఫొగట్ ఘన విజయం
రెజ్లర్గా ఉండి.. రాజకీయ నాయకురాలిగా మారిన వినేశ్ ఫొగట్ తొలిసారి విజయం సాధించారు. జులానా సీటు నుంచి 6,015 ఓట్ల మెజార్టీతో ఆమె గెలిచారు. అయితే.. ఆమె విషయంలోనూ విజయం దోబూచూలాడుతూ వచ్చినా.. చివరకు ఆమెదే పై చేయి అయింది. గత అసెంబ్లీలో 41 సీట్లు ఉన్ నబీజేపీ.. ఇప్పుడు 50 సీట్లలో విజయం/ ఆధిక్యం దిశగా ఉండటం విశేషం.
బీజేపీ మూడోసారి అధికారంలోకి రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి తాను సైతం రేసులో ఉన్నానని సీనియర్ నేత అనిల్ విజ్ చెబుతున్నారు. ‘మా పార్టీలో వ్యక్తుల ఇటువంటి ప్రకటనలు చేయరు. నేను గతంలోనే చెప్పినట్టు ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు వెనుకాడను. నిర్ణయం పార్టీ అధిష్ఠానం తీసుకోవాలి’ అని విజ్ తన ఉద్దేశాన్ని స్పష్టంగానే బయటపెట్టారు.