Site icon vidhaatha

కోల్​కతా ఆర్​జీ కార్​ హాస్పిటల్​ మాజీ ప్రిన్సిపాల్​ – ఎవరీ సందీప్​ ఘోష్​.?

సందీప్​ ఘోష్​(Dr. Sandip Ghosh)… గత కొన్ని రోజులుగా దేశం మొత్తం మార్మోగిపోతున్న పేరు. కోల్​కతాలోని ఆర్​జీ కరా వైద్య కళాశాల–ఆసుపత్రి (RG Kar Medical College and Hospital) మాజీ ప్రిన్సిపాల్​. ఈనెల 9న ఒక వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య జరిగినప్పుడు తనే ప్రిన్సిపాల్​గా ఉన్నాడు. జరిగిన దారుణ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును పూర్తిగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినవాడు. ఆనాటి నుండి వరుసగా జరిగిన ఎన్నో ఘటనలకు మూలకారకుడు. టిఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి అత్యంత సన్నిహితుడిగా పేరు. ఆ సాన్నిహిత్యమే అతన్ని కర్కోటకుడిగా మార్చేసింది.

దేశ సర్వోన్నత న్యాయస్థానం, కోల్​కతా హైకోర్టు ఈ ఘటనలో ప్రభుత్వ చర్యలపై సందేహాలు లేవనెత్తినపుడు అన్ని వేళ్లూ సందీప్​నే చూపించాయి. కారణం, ఆ అమ్మాయి హత్యాచారం జరిగిన రోజు ఆ కాలేజీ అధిపతిగా ఉన్నది సందీపే కాబట్టి. కనీసం ఎఫ్​ఐఆర్​ నమోదు కాకుండా(Autopsy without FIR) విద్యార్థిని మృతదేహానికి పోస్టమార్టం నిర్వహించారు. ఇది ఈ దేశంలో ఇప్పటిదాకా జరగని విషయం. కోల్​కతా పోలీసులు ఈ విషయమై సందీప్​ను కనీసం ప్రశ్నించనూలేదు. ఘటన జరిగిన మూడురోజుల వరకు జరిగిన ఆందోళనల వల్ల పదవి నుండి వైదొలగినా, కేవలం మూడే మూడు గంటల్లో తిరిగి వేరే కాలేజీకి ప్రిన్సిపాల్​గా నియమించబడ్డాడు. కేసు ఇప్పుడు సిబిఐ(CBI) చేతికి వెళ్లింది కాబట్టి, ఆరు రోజుల పాటు సందీప్​ను సిబిఐ కూలంకషంగా ప్రశ్నించింది. ఆయన అధికారిగా ఉన్నప్పుడు కాలేజీలో జరిగిన ఆర్థికపరమైన అక్రమాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా మృతురాలి గుర్తింపును తెలపడం లాంటి అవకతవకలపై సిబిఐ విచారణ జరుపుతోంది.

ఒక తెలివైన విద్యార్థి నుండి, ప్రముఖ పూర్వవిద్యార్థి( illustrious alumni)గా, అక్కన్నుండి ఓ వైద్యుడిగా, తర్వాత మెడికల్​ కాలేజీకి వివాదాస్పద ప్రిన్సిపాల్​గా సందీప్​ ఘోష్​ ప్రస్థానం బహుముఖంగా సాగింది. చిన్నప్పటి సందీప్​ను ఎరిగిన ఎవరూ అతను ఇలా మారాడంటే నమ్మడంలేదు.

ఈ సంఘటన జరగడానికి ముందు, ఆ కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్​ అక్తర్​ అలీ(Akthar Ali), ప్రభుత్వానికి, రాష్ట్ర విజిలెన్స్​ విభాగానికి, అవినీతి నిరోధక శాఖకు ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి గురించి పదిహేను పాయింట్లతో ఫిర్యాదు చేయగా, ఎటువంటి చర్యా తీసుకోకపోగా, అలీనే బదిలీ చేసారు.

సందీప్​ ఘోష్​ చేసిన దారుణాలు అన్నిఇన్నీ కావని మెల్లమెల్లగా తెలుస్తున్నాయి. ఇప్పుడు తన పాపం పండటంతో బాధితులు, తన గురించి పూర్తిగా తెలిసిన వారు సిబిఐకి వివరాలందిస్తున్నారు. అనాథ శవాలను అమ్ముకోవడం, వాడిపారేసిన మెడికల్​ వేస్ట్​(Recycling Medical waste)ను తిరిగి బంగ్లాదేశ్​లో రీసైక్లింగ్​ చేయించి, తిరిగి కొత్తవాటిగా కొనడం, టెండర్లలో ఆశ్రిత పక్షపాతం, విద్యార్థులను కావాలనే ఫెయిల్​ చేయడం లాంటివి ఎన్నో తన ఖాతాలో ఉన్నట్లు తెలిసింది.

కోల్​కతాకు 80 కి.మీల దూరంలో, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బొంగావ్(Bongaon)​లో చదువుకున్న సందీప్​, మంచి తెలివైన విద్యార్థి(meritorious student)గా పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడు 85శాతానికి తక్కువ కాకుండా మార్కులు వచ్చేవి. 12వ తరగతిలో కూడా 80శాతానికి పైగా మార్కులు తెచ్చుకున్నసందీప్​ మెడికల్​ జాయింట్​ ఎంట్రన్స్​ ఎగ్జామ్​ రాసి, అడ్మిషన్​ కూడా సంపాదించుకున్నాడు.  ఇప్పటికీ ఆ పాఠశాలలో ప్రముఖ పూర్వ విద్యార్థిగా సందీప్​ ఘోష్​ పేరు బోర్డు మీద ఉంది. ఇప్పుడు ఆ పేరు కొట్టేయాలని అక్కడి టీచర్లు, స్టూడెంట్లు గొడవ చేస్తున్నారు.

మాకు తెలిసిన సందీప్​ ఇలాంటివాడు కాదు. కొద్దమందే స్నేహితులతో చాలా నెమ్మదస్తుడి(soft nature)గా ఉండేవాడు. ఇలా మారాడంటే నమ్మలేకపోతున్నానని అప్పటి తన పక్కింటి పార్థసారథి తెలిపాడు. బహుశా దురాశే అతన్నీస్థాయికి తెచ్చింది. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం అని ఆయన అన్నారు. 1994లో మెడికల్​ డిగ్రీ చేతికి వచ్చినప్పటికీ, ఆర్థోపెడిక్​ ప్రొఫెసర్​గా, సర్జన్​గా చాల ఏళ్లవరకు అతనెవరికీ పెద్దగా తెలియదు. 2018లో ఆర్​జీ కార్​ మెడికల్​ కాలేజ్​ వైస్​ ప్రిన్సిపాల్​గా పోస్టింగ్​ వచ్చాక, ఒక్కసారిగా అతను వెలుగులోకి వచ్చాడు. 2021లో అదే కాలేజీకి ప్రిన్సిపాల్​గా చార్జ్​ తీసుకున్నాక తన విశ్వరూపం ప్రదర్శించడం మొదలుపెట్టాడు.  నాలుగు సంవత్సరాల పదవీకాలంలో అతను మూడు సార్లు బదిలీ(Transferred thrice) అయ్యాడు. అయితే ప్రతీసారి అయన తిరిగి అదే పోస్టులో నియమితుడయ్యేవాడు. ఒకసారైతే కొన్నిగంటల్లోనే. ఆర్​జీ కార్​ పూర్వ విద్యార్థులు ఆరోపించినదాని ప్రకారం, సందీప్​ కాలేజీ, హస్పటల్​ను తన సామ్రాజ్యం(fiefdom)గా భావించేవాడు. దానికి అతని అనుచరులు పూర్తిస్థాయిలో సహకరించేవారు. తనకు విధేయులుగా ఉన్న విద్యార్థులకు పూర్తిస్వేచ్ఛనిచ్చి, ఇతర విద్యార్థులను రకరకాలుగా హింసించేవాడని, తన గ్రూప్​ మొత్తం కాలేజీని, హాస్పటల్​ను నియంత్రించేదని, హస్టల్​ సీట్లనుండి, ఆసుపత్రి బెడ్ల దాకా, అంతటా వసూళ్లేనని వారు ఆరోపించారు.

కోల్​కతాలో సందీప్​ ఘోష్​ పక్కింటివారు చెప్పిందేంటంటే, తను తన భార్య పచ్చి బాలింతరాలుగా ఉన్నప్పుడు కడుపులో తంతే, ఆమె ప్రాణాపాయస్థితికి వెళ్లందనీ, అప్పుడు కూడా ఇరుగుపొరుగు వారే కాపాడారని తెలిపారు. ఘోష్​ చేసిన ఇలాంటి అరాచకాలకు అంతేలేదని అతనేంటో తెలిసిన అందరూ ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకరకంగా ప్రధాన ముద్దాయి(Sanjay Roy) కంటే సందీప్​ ఘోష్​ ఇంకా ప్రమాదకారి అని వారి అభిప్రాయం.

 

 

Exit mobile version