Kaleshwaram | కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్కు సంబంధించిన బ్యాంక్ లాకర్స్లో ఏసీబీ అధికారులు భారీగా నగదు గుర్తించారు. శ్రీధర్ బ్యాంకు లాకర్స్లో రూ.5 కోట్ల వరకు నగదు, బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవతవకలపై ఇప్పటికే విజిలెన్స్ కమిటీ, ఎన్డీఎస్ఏ, కాగ్ నివేదికలు సమర్పించగా.. జస్టిస్ పీసీ. ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో ఏసీబీ దాడులకు గురైన కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ వద్ధ రూ.200కోట్ల మేరకు అక్రమాస్తులు గుర్తించబడటం.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి నిదర్శనమంటున్నాయి బీఆర్ఎస్ యేతర రాజకీయ పక్షాలు.
ఏసీబీ తనిఖీల్లో ప్లాట్లు, స్థలాలు, భవనాలు, భూములు, డైమండ్లు, నగలు, నగదు సహా భారీ ఎత్తున అక్రమాస్తులను గుర్తించారు. నూనె శ్రీధర్ ఏడాది క్రితమే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బదిలీ అయ్యారు. అయినప్పటికి అతడు అక్కడే తన విధులు కొనసాగిస్తున్నట్టు ఏసీబీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. బదిలీ అయినప్పటికీ శ్రీధర్ కాళేశ్వరంలోనే ఎందుకు పనిచేస్తున్నారనేదానిపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. చంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న శ్రీధర్ కస్టడీ మంగళవారంతో ముగియ్యనుంది.