KALESWARAM COMMISSION | కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో అవకతవకలపై విచారిస్తున్న జస్టిస్ ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్కు మళ్లీ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకావాల్సిన తేదీలను మార్చుతూ ఈ నోటీసులు అందించారు. జూన్ ఆరవ తేదీన ఈటల రాజేందర్, 9వ తేదీన హరీష్ రావుకు రావాలని కోరారు. ముందు నిర్ణయించిన ప్రకారం ఆరవ తేదీన హరీష్ రావు, 9వ తేదీన ఈటల కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉన్నది. అయితే.. ఈ తేదీలను అటుదిటు ఇటుదటు మార్చడం ఆసక్తి రేపింది. ఈటల రాజేందర్ బీఆరెస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాతి రాజకీయ పరిణామాల్లో బీఆరెస్ను వదిలి, బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ముందుగా ఈటలను పిలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాను కమిషన్ ఎదుట హాజరై వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతానని ఇప్పటికే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ముందుగా హరీశ్ నుంచి వివరాలు తీసుకునేబదులు.. ఈటల నుంచి తీసుకోవడం ఉపయగకరమని కమిషన్ భావించి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేసీఆర్, హరీశ్ను ఇరకాటంలో పడేసినట్టు అవుతుందని అంటున్నారు.
KALESWARAM COMMISSION | కాళేశ్వరం విచారణలో కీలక ట్విస్ట్
