విధాత: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు విజయవాడ కోర్టు మూడు రోజుల కస్టడీ విధించింది. కస్టడీ పిటిషన్పై విజయవాడ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఆయన్ను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. ఆది, సోమ, మంగళవారాల్లో సీఐడీ అధికారులు ఆయన్ను కస్టడీకి తీసుకోనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది.
ముంబయికి చెందిన సినీ నటి కాదంబరి జెత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై అక్రమ కేసు బనాయించి వేధించిన కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టయ్యారు. ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండు ఖైదీగా ఉన్నారు. కస్టడీలో విచారణకు ముందు విచారణకు తర్వాత వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయాలని కోర్టు ఆదేశించింది.