విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గెలవడం ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కోన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. పోటీ చేసి గెలిచింది 21 సీట్లలో అయినా 175 సీట్లలో గెలిపిస్తే ఎంత బాధ్యత ఉంటుందో అంతే బాధ్యతగా పనిచేస్తామన్నారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలమైన పునాదులు వేసే సమయమని పార్టీ శ్రేణులకు చెప్పారు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదని.. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు గుర్తున్నాయన్నారు. ప్రజలకు జవాబుదారీతనం చెప్పే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందన్నారు. జగన్తో నాకు వ్యక్తిగత కక్ష లేదు. కక్ష సాధింపు కోసం మనకి జనం అధికారం ఇవ్వలేదని, ఐదు కోట్ల ఆంధ్రులకు న్యాయం చేయాల్సివుందన్నారు. నా జీవితం ఎప్పుడూ దెబ్బలు తినడమేనని, సినిమా పరంగా తొలిప్రేమ విజయం.. రాజకీయాల్లో ఈ విజయం, డబ్బు, పేరు కోసం నేను రాజకీయాల్లోకి రాలేదని, సగటు మనిషి కష్టం చూసి వచ్చానని చెప్పారు. 2019లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని, గెలుపోటములను సమానంగా తీసుకుంటున్నానని, ఆకాశమంత విజయాన్నిచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.