విధాత, హైదరాబాద్ :
భారత్–సౌతాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ అనంతరం వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా, నవంబర్ 30న తొలి వన్డే జరుగుతుంది. ఈ క్రమంలో డిసెంబర్ 6న విశాఖపట్నంలో మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. దీని కోసం ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులకు ఆంధ్ర క్రికెట్ సంఘం అధికారులు శుభవార్త తెలిపారు. మూడో వన్డే టికెట్ విక్రయ షెడ్యూల్ను విడుదల చేశారు.
ఈ నెల 29వ తేదీ నుంచి ఆన్లైన్లో టికెట్ల విక్రయాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 22 వేల టికెట్లు ఆన్లైన్లోనే అందుబాటులోకి రానున్నాయి. కాగా, డిసెంబర్ 4వ తేదీన భారత్, సౌతాఫ్రికా ఇరు జట్లు విశాఖపట్నానికి చేరుకోనున్నాయి. అనంతరం జట్లు ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించగా, భద్రతా ఏర్పాట్లు, లాజిస్టిక్స్ అమలు అంశాలను అధికారులు సమీక్షించనున్నారు. ఇప్పటికే నగరంలో క్రికెట్ జోష్ ఊపందుకోవడంతో మ్యాచ్కు భారీగా ప్రేక్షకులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
