కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి ఎంపీ అభ్యర్థులు, ఇంచార్జిలకు.. సీఎం రేవంత్‌రెడ్డి సూచన

కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పార్లమెంట్ అభ్యర్థులు, ఇంచార్జిలు, ఏఐసీసీ సెక్రెటరీలకు సీఎం రేవంత్‌రెడ్డి మార్గదర్శకం చేశారు. సోమవారం పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌పై వారితో రేవంత్‌రెడ్డి జూమ్ మీటింగ్‌లో సమీక్ష నిర్వహించారు.

  • Publish Date - June 3, 2024 / 03:21 PM IST

విధాత, హైదరాబాద్ : కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పార్లమెంట్ అభ్యర్థులు, ఇంచార్జిలు, ఏఐసీసీ సెక్రెటరీలకు సీఎం రేవంత్‌రెడ్డి మార్గదర్శకం చేశారు. సోమవారం పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌పై వారితో రేవంత్‌రెడ్డి జూమ్ మీటింగ్‌లో సమీక్ష నిర్వహించారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు ఈ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి రౌండ్‌లో కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్ గా పంపాలని సూచించారు. సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకెళ్లేలా చూసుకోండని తెలిపారు. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుందని, ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర 17సీ లిస్ట్ ఉండేలా చూసుకోవాలని, ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రతి అభ్యర్థి కౌంటింగ్ అంశాలపై అవగాహనతో ఉండాలని సూచించారు.

Latest News