తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా … మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియామకం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. మౌలిక వ‌స‌తులు, ప్రాజెక్టుల స‌ల‌హాదారుగా శ్రీనివాస‌రాజు నియామ‌కం అయ్యారు

  • Publish Date - July 1, 2024 / 07:05 PM IST

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియామకం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. మౌలిక వ‌స‌తులు, ప్రాజెక్టుల స‌ల‌హాదారుగా శ్రీనివాస‌రాజు నియామ‌కం అయ్యారు.తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా సుదీర్ఘకాలంగా పనిచేసిన కేఎస్‌ శ్రీనివాసరాజు వీఆర్‌ఎస్‌ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏపీ ఐఏఎస్‌ క్యాడర్‌లో 2001 బ్యాచ్‌కు చెందిన ఆయన 2011లో వైజాగ్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో టీటీడీ జేఈవోగా నియమితులయ్యారు. ఏప్రిల్‌ 20వ తేదీన జేఈవోగా బాధ్యతలు తీసుకుని 2019 జూన్‌ వరకు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు పనిచేశారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల్లో జేఈవోగా విధులు నిర్వహించారు. అయితే జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఆయన ఇంటర్‌ కేడర్‌పై తెలంగాణ రాష్ర్టానికి వ‌చ్చారు. తెలంగాణలో నాలుగేండ్ల పాటు ర‌హ‌దారులు భ‌వ‌నాల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌ర్తించారు. మార్చి నెలతో డిప్యుటేషన్‌ గడువు ముగియడంతో పొడిగింపునకు క్యాట్‌ను ఆశ్రయించారు. అనుమతి రాకపోవడంతో ఏపీకి రాక తప్పలేదు. గత మే నెలలో ఏపీ సీఎస్‌కు రిపోర్టు చేశారు. టీటీడీ ఈవోగా వచ్చేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినా కూటమి ప్రభుత్వం శ్యామలరావును ఈవోగా నియమించింది. దీంతో ఈనెల 19వ తేదీన శ్రీనివాసరాజు వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో గ‌త వారం ఆమోదం తెలుపుతూ ఏపీ ప్రభుత్వ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను నీటిపారుదల, నీటి వనరుల శాఖ సలహాదారుగా నియమించిన ప్రభుత్వం తాజాగా మరో ఏపీ మాజీ ఐఏఎస్‌ను తెలంగాణ సలహాదారుగా నియమించడం గమనార్హం.

Latest News