విధాత : హన్మకొండ జిల్లా వేలేరులో దివంగత మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఫ్లెక్సీలు కలకలం రేపరేపాయి. హిడ్మాను కీర్తిస్తూ..పోరాట వీరుడా వందనం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ఓ వీరుడా నువ్వు కన్న కల దోపిడీ లేని స్వేచ్ఛాయుత దేశం. నీ సింధూరం పీడిత జనానికి కొత్త పొద్దు. ప్రజల గుండెల్లో నీ చరిత్ర సజీవం. పీడిత జనాల స్వేఛ్చా పోరాటానికి నీవు నిత్యం రణభేరి నినాదం. జనతన సర్కార్ ఆశయం చిరస్థాయి వీరుడా హిడ్మా.. నీ పోరాటం అమరం.. అంటూ రాసి ఉంది.
ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులు సురేష్, బుచ్చయ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిషేధిత మావోయిస్టులపై సానుభూతి వ్యక్తం చేస్తే చట్ట పరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఇటీవల ఏపీలోని మారేడుమిల్లి అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మద్వి హిడ్మాతో పాటు అతని భార్య రాజే సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. హిడ్మా లొంగిపోదామని సిద్ధమైనప్పటికీ ఆయనను బూటకపు ఎన్ కౌంటర్ చేశారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. పట్టుకుని మట్టుబెట్టారంటూ మావోయిస్టు పార్టీ ఆరోపించింది. బూటకపు ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ నవంబర్ 23ను దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని ప్రజలకు, ప్రజాసంఘాలకు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.
