CM Revanth Reddy | విద్యపై పెట్టుబడి..సమాజానికి లాభం … సీఎం రేవంత్‌ రెడ్డి

విద్యపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదని పెట్టుబడి అని, తద్వారా సమాజానికి లాభం చేకూరుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కోన్నారు. సోమవారం రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హజరై మాట్లాడారు

  • Publish Date - June 10, 2024 / 05:38 PM IST

గ్రీన్‌ చానెల్‌ ద్వారా పాఠశాలలకు నిధులు
సెమీరెసిడెన్షియల్‌ విధానంపై పరిశీలన
ప్రతి గ్రామం..తండాలకు ప్రభుత్వ విద్య

విధాత, హైదరాబాద్ :

విద్యపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదని పెట్టుబడి అని, తద్వారా సమాజానికి లాభం చేకూరుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కోన్నారు. సోమవారం రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హజరై మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుండేదని, వందేమాతరం ఫౌండేషన్ ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా మా బాధ్యతను గుర్తు చేసిందని అభినందించారు. నారాయణ కాలేజీలో ర్యాంకు సాధిస్తే ఈ విద్యార్థులు నా కాలేజీలో చదివారని వారితో ఫోటో దిగి నారాయణ ప్రచారం చేసుకుంటాడని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి నారాయణ, చైతన్య వంటి కార్పోరేట్‌ సంస్థలతో పోటీ పడి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మీరు మా గౌరవానికి ప్రతీకలని మేం గర్వంగా చెబుతున్నాన్నారు. ప్రభుత్వ పరంగా పెద్దగా మద్దతు లేకపోయినా మట్టిలో మాణిక్యాలుగా రాణించి ఉన్నత మార్కులు సాధించడం అభినందనీయమన్నారు.

ప్రయివేట్ పాఠశాలలతో పోటీపడి కార్పొరేట్ పాఠశాలలతో ప్రభుత్వ విద్యార్థులు పోటీపడటం మా గౌరవాన్ని మరింత పెంచిందని, 90శాతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠాశాలల్లో చదివినవారేనని గుర్తు చేశారు. నాతో సహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారేనని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికి గర్వకారణమన్నారు. విద్యార్థులు రావడం లేదని సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని, మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. టీచర్లు లేకపోతే పిల్లలు బడికి రారని, పిల్లలు లేకపోతే బడులు మూసేస్తున్నారని ఈ వ్యవహారం కోడి ముందా గుడ్డు ముందా అన్నట్లుగా తయారైందన్నారు. కానీ సింగిల్ టీచర్ పాఠశాలలను మూసేయొద్దని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ప్రతీ గ్రామం, ప్రతీ తండాకు విద్యను అందించేలా ప్రభుత్వం ముందుకెళుతుందని చెప్పారు. శిథిలావస్థకు చేరిన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని, త్వరలో డీఎస్సీ ద్వారా 11వేల టీచర్ల భర్తీ చేపట్టామన్నారు.

గ్రీన్ ఛానెల్ ద్వారా పాఠశాలలకు నిధులు

అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను, మధ్యాహ్న భోజన పథకాన్ని మహిళా సంఘాలకు అప్పగించామని రేవంత్‌రెడ్డి తెలిపారు. వారికి గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించామని, ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించారు. రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా తల్లదండ్రులకు పిల్లల సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ఉండే పాఠశాలలపై నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం 80వేలు ఖర్చు చేస్తుందని, ఇందులో ఎక్కువగా టీచర్ల వేతనాలకే వెలుతున్నాయన్నారు. త్వరలో విద్య, వ్యవసాయ కమిషన్ లను ఏర్పాటు చేసి నిరంతరం సమస్యలను పరిష్కరించే వెసులుబాటు కల్పించబోతున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు సిలబస్‌ మార్పుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మా ప్రభుత్వానికి భేషజాలు లేవని, ఎవరైనా సలహాలు ఇస్తే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 10/10 వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశిస్తున్నామని, ఇంటర్మీడియట్ లోనూ స్టేట్ ర్యాంకులు సాధించి భవిష్యత్ లో రాణించాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కోన్నారు. మీకు ప్రజా ప్రభుత్వం ఉందని, ప్రజా పాలనపై నమ్మకం కలిగించేలా ముందుకెళతామని రేవంత్‌రెడ్డి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు భరోసానిచ్చారు.

 

 

Latest News