విధాత, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ప్రారంభించిన ‘నారాయణపేట-కొడంగల్-మక్తల్’ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. పర్యావరణ క్లియరెన్స్ వచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్టరాదని ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న నారాయణపేట-కొడంగల్-మక్తల్’ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. నిర్మాణ అంచనా రూ.4,350 కోట్లుగా వేశారు. ఈ పథకానికి 2024-25 బడ్జెట్లో రూ.610 కోట్లను కేటాయించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీటితో పాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చడానికి వీలుగా రెండు దశల్లో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు. తొలుత ఈ పథకం కింద ఉన్న చెరువుల నిల్వ సామర్థ్యాన్ని 0.9 టీఎంసీలతో ప్రతిపాదించగా తాజాగా 4 టీఎంసీలకు పెంచారు. తాజా ప్రతిపాదనల ప్రకారం భూత్పూరు జలాశయం నుంచి కనుకుర్తి వరకు మూడు చోట్ల నీటిని లిఫ్ట్ చేయాలని, మొత్తం రెండు దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రెండు ప్యాకేజీలలో పనులు
నారాయణపేట – కొడంగల్ లిఫ్ట్ పనులను రెండు ప్యాకేజీలుగా నిర్ణయించారు. ఒకటో ప్యాకేజీని తొలి దశలో భూత్పురు జలాశయం నుంచి ఉట్కూరుచెరువు దాకా, రెండో ప్యాకేజీలో జయమ్మ చెరువుకు, అక్కడి నుంచి కనుకుర్తి చెరువు దాకా నీటిని పంపింగ్ చేసే పనులను చేర్చారు. ఈ క్రమంలో ఉట్కూరు, జయమ్మ, కనుకుర్తి చెరువుల ఆధునికీకరణ, నీటి నిల్వ పెంచడానికి వీలుగా మొదటి దశ పనులకు రూ.2945 కోట్లు వెచ్చించనున్నారు.
రెండో దశలో ఏడు చెరువులు (జాజాపూర్, దౌలతాబాద్, బొమ్మరాసిపేట, లక్ష్మీపూర్, ఎర్లపల్లి, హుస్నాబాద్, కొడంగల్) సామర్థ్యాన్ని పెంచుతారు. గ్రావిటీ కాల్వలు, ఆయకట్టుకు నీటిని అందించే డిస్ర్టిబ్యూటరీ కాల్వల నిర్మాణం చేపడుతారు. దీనికి రూ.1404.50 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మొత్తం లక్ష ఎకరాల ఆయకట్టుకు ఈ పథకం ద్వారా సాగునీటిని అందిస్తారు. అలాగే 0.38 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాల్లో తాగునీటిని అందించనున్నారు. నారాయణపేట – కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో మొత్తం 36 కిలోమీటర్ల మేర ప్రెషర్ మెయిన్లు (టన్నెల్కు బదులుగాపైపులు) వాడాలని నిర్ణయించారు. రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన భూత్పూరు జలాశయం నుంచి నీటిని తరలించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
