Bus Accident | ఆంధ్రప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సంతా వ్యాపించాయి. అగ్నికీలల ధాటికి 10 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారాయి. గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. కాలిన గాయాలతో కొందరు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు పెట్టారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మంటలను అదుపు చేసి ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
