Road Accident | హైదరాబాద్ : తమిళనాడు( Tamil Nadu )లో ఘోర రోడ్డు ప్రమాదం( Road Accident ) జరిగింది. ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు( Ayyappa Devotees ) మృతి చెందారు. మరో భక్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం పరిధిలోని మరుపల్లి, దత్తిరాజేరు గ్రామాలకు చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు ఇటీవల శబరిమల వెళ్లారు. శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకున్న అనంతరం తమ సొంతూరికి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే నిన్న రాత్రి తమిళనాడు మీదుగా ప్రయాణిస్తూ.. రామేశ్వరం వద్ద రోడ్డు పక్కకు తమ కారును ఆపారు. అక్కడే భక్తులు ఐదుగురు కూడా నిద్రిస్తున్నారు.
గాఢ నిద్రలో ఉన్న అయ్యప్ప భక్తులను వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. అయ్యప్ప భక్తుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
