చేతి, కాలి గోళ్లను ఎప్పుడంటే ఎప్పుడు తీయకూడదు. రాత్రి పూట అసలు గోళ్లను కత్తిరించొద్దని పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ మనం వినిపించుకోం. కొందరైతే నిత్యం నోట్లోనే వేళ్లను పెట్టి గోళ్లను కొరికేస్తుంటారు. చాలా మంది సూర్యుడు అస్తమించిన తర్వాత గోళ్లను కత్తిరిస్తుంటారు. ఇలా సూర్యాస్తమయం అంటే చీకటి పడిన తర్వాత, నిత్యం వేళ్లను నోట్లో పెట్టుకుని గోళ్లను తీసుకునే వారిని అరిష్టం వెంటాడుతూనే ఉంటుందట. మరి ముఖ్యంగా లక్ష్మీదేవికి కోపం వస్తుందట. దాంతో అనేక ఆర్థిక కష్టాలు మొదలయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
లక్ష్మీదేవికి కోపం వస్తుందట..!
సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీదేవి యాత్రకు బయల్దేరుతుందట. కాబట్టి చీకటి పడ్డ తర్వాత గోళ్లను కత్తిరించడంతో.. లక్ష్మీదేవికి తీవ్రమైన కోపం వస్తుందట. దీంతో ఆ ఇంట్లో శుభకార్యాలు నిలిచిపోతాయని, రావాల్సిన నగదు రాకుండా ఆగిపోవడం, తరుగుదల కావడం జరుగుతుందని నమ్మకం. దాచిన డబ్బు కూడా క్షణాల్లో మాయమవుతుందని విశ్వాసం.
ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం..!
ఆయుర్వేదం ప్రకారం.. గోర్లు కత్తిరించడానికి, చంద్రుని శక్తికి నిర్దిష్ట సంబంధం ఉంది. చంద్రుడు ప్రశాంతతకు చిహ్నం. కాబట్టి, సాయంత్రం చంద్రుని శక్తి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, మీ గోర్లు కత్తిరించడం వలన దాని శక్తికి అంతరాయం కలిగించవచ్చు. మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ..!
రాత్రి పూట గోర్లను కత్తిరిస్తే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. ఇది దురదృష్టాన్ని కూడా కలిగిస్తుందట. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని చెబుతున్నారు. అందుకే కొంతమంది తెలియకుండా ఎవరైనా చీకటిలో గోళ్లు కత్తిరిస్తున్నట్లయితే.. వారిని వద్దు అని వారిస్తుంటారు.
శని గ్రహంపై ప్రతికూల ప్రభావం..!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత గోర్లు కత్తిరించడం గ్రహాలపై, ముఖ్యంగా సూర్యుడు, శనిగ్రహాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సూర్యుని ప్రతికూల ప్రభావం వల్ల సమాజంలో వ్యక్తి గౌరవం తగ్గుతుంది. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం శనిదేవుడు గోళ్లలో ఉంటాడు. సాయంత్రం తర్వాత గోళ్లు కత్తిరించడం వల్ల శనికి కోపం వస్తుంది.