హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని వయోపరిమితిని 46 ఏండ్లకు పెంచి త్వరలోనే గ్రూప్-1 నిర్వహిస్తామని రేవంత్ శాసనసభా వేదికగా ప్రకటించారు.
కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైందని సీఎం తెలిపారు. నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్లం కాదన్నారు.
ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలను అమ్ముకునే వాళ్లం కానే కాదన్నారు. పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతో కాలం నిరీక్షించారు. త్వరలోనే పోలీసు శాఖలో 15 వేల ఉద్యోగ నియామకాలు చేపడుతామన్నారు. యూనివర్సిటీలలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే నిర్దిష్ట విధానం ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.