విధాత: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో ఆయనపై విష ప్రయోగం జరిగింది. ఆ సమయంలో ఆయన మరణ మృదంగం సినిమా చేస్తున్నారు. ఆ సందర్భంగా ఆయనపై ఓ అభిమాని విష ప్రయోగం చేశాడని నాడు మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. తాజాగా వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్లో భాగంగా చిరు గతంలో తనపై జరిగిన విష ప్రయోగంపై స్పందించారు. అప్పట్లో ఏం జరిగిందో తెలియజేశారు.
ఆ సినిమా షూటింగ్లో ఓ పిచ్చి ఫ్యాన్ చేసిన పని ఇది. ఫైట్ సీన్స్ చేస్తున్నప్పుడు నన్ను చూడటానికి చాలా మంది వచ్చారు. నా కోసం కేక్ తెచ్చి కట్ చేయమన్నారు. నేను అదే చేశాను. ఒక వ్యక్తి కేక్ ముక్కను నా నోట్లో బలవంతంగా పెట్టాడు. అయితే ఆ కేక్ చేదుగా అనిపించింది. చూస్తే కేక్లో ఏదో పౌడర్ ఉన్నట్టు అనిపించింది. మా వాళ్లు పట్టుకొని వారిని అడిగితే ఏం లేదన్నాడు.
కానీ ఆ కేక్ ని టెస్టులకు పంపిస్తే పాయిజన్ అనే రిపోర్టు వచ్చింది. వెంటనే నిర్మాత కె.యస్. రామారావు గారు అతనిని కొట్టారు. ఎందుకు ఇలా చేశావని అడిగితే చిరంజీవి ఈ మధ్య నాతో సరిగా మాట్లాడటం లేదు. ఆయనకు దగ్గర అవ్వాలని ఇలా చేశాను. కేరళ నుంచి తెచ్చిన వశీకరణ మందు తెచ్చి కేక్లో కలిపానని చెప్పుకొచ్చాడు.
నేను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. విష ప్రయోగం లాంటి పెద్ద పదాలు వాడవద్దని చెప్పాను. వాడి అభిమానం వాడిది. వాడిది అభిమానం అనుకోవాలో, మూర్ఖత్వం అనుకోవాలో నాకు అర్థం కాలేదు. వాడు మాత్రం అభిమానంతోనే చేశాడు. అలాంటి వాడిని ఏం చేస్తామని నవ్వుకున్నానంటూ చెప్పుకొచ్చారు.
కాగా ఆనాడు చిరుపై విష ప్రయోగమని దీనిపై తారాస్థాయిలో చర్చలు జరిగిన సంగతి నాటి తరం ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. ఆనాటి సంఘటనను చిరు ఇంత కాలానికి తన నోటి ద్వారా రివీల్ చేశారు.