విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ ట్రై సిటీస్ ముంపునకు భూ కబ్జాలే కారణమంటూ భూ కబ్జాదారులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ భూములు, నాళాలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా వదిలేసి వెళ్ళాలని సూచించారు. మంగళవారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. భూ కబ్జాదారులకు నెల రోజుల సమయం ఇస్తున్నామంటూ డెడ్లైన్ విధించారు.
లేదంటే భూ కబ్జాదారుల భరతం పడతామని హెచ్చరించారు. మేధావులు, అధికారులు, అన్ని పార్టీల నాయకులతో సమన్వయ కమిటీ వేసి కఠినచర్యలు తీసుకుంటామన్నారు. పదేళ్ల పాలనలో కనీసం వరంగల్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయలేక పోయారని విమర్శించారు. తమ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ కు ప్రాధాన్యతనిస్తుందని ప్రకటించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటామని, దీనివల్ల నగర ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.