PM Modi : కేంద్ర క్యాబినెట్ ఇవాళ తొలిసారి భేటీ కానుంది. ఈ సాయంత్రం 5 గంటలకు క్యాబినెట్ సమావేశం కాబోతోంది. 18వ లోక్సభ తొలి భేటీ, కొత్త ఎంపీల ప్రమాణస్వీకారాలు, పార్లమెంట్ ఉభయసభల్లో రాష్ట్రపతి ప్రసంగం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా పనిచేసిన నరేంద్రమోదీ.. ఆదివారం రాత్రి ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.
తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత దేశానికి వరుసగా మూడోసారి ప్రధాని అయిన తొలి వ్యక్తిగా నరేంద్రమోదీ రికార్డు సృష్టించారు. రాష్ట్రపతి భవన్లో ఆహ్లాదభరిత వాతావరణంలో అట్టహాసంగా జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీ చేత ప్రధానిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏడు దేశాల అధినేతలు, భారత మాజీ రాష్ట్రపతులు, వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీతారలు, మత గురువులు, పారిశుద్ధ్య కార్మికులు, వందేభారత్ లోకోపైలట్లు సహా సమాజంలో వివిధ వర్గాలకు చెందినవారు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో నరేంద్రమోదీతోపాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఉన్నారు. మిత్రపక్షం టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ బెర్త్ దక్కింది. మంత్రివర్గం ప్రమాణస్వీకారం పూర్తికావడంతో ఇవాళ తొలిసారి మోదీ క్యాబినెట్ భేటీ కాబోతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ తొలి భేటీ జరగనుంది.