Iran leadership crisis| ఇరాన్ పాలన సుప్రీం లీడర్‌ నుంచి కౌన్సిల్ చేతిలోకి..!

ఇరాన్ పాలన సుప్రీం లీడర్ చేతి నుంచి కౌన్సిల్ చేతిలోకి వెళ్లింది. ముగ్గురు సభ్యుల తాత్కాలిక కౌన్సిల్ చేతికి దేశ పాలనా పగ్గాలు మారినట్లుగా ఆ దేశ అధికారిక మీడియా ఐఆర్ఎన్ఏ ప్రకటించింది.

న్యూఢిల్లీ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ వారసుడి అధికారిక ప్రకటనపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ పాలన సుప్రీం లీడర్ చేతి నుంచి కౌన్సిల్ చేతిలోకి వెళ్లింది. ముగ్గురు సభ్యుల తాత్కాలిక కౌన్సిల్ చేతికి దేశ పాలనా పగ్గాలు మారినట్లుగా ఆ దేశ అధికారిక మీడియా ఐఆర్ఎన్ఏ ప్రకటించింది. అధ్యక్షుడు మసూత్ పెజెష్కియాన్, న్యాయ వ్యవస్థ అధిపతి, గార్డియన్ కౌన్సిల్లోని జ్యూరీ సభ్యుడితో ఏర్పాటైన తాత్కాలిక కౌన్సిల్ ఇరాన్ పాలన పర్యవేక్షించనుంది.

ఇరాన్ పరిపాలన వ్యవస్థలలో గార్డియన్ కౌన్సిల్ కీలకమైంది. ఇందులో 88 మంది సభ్యులు ఉంటారు. వీరిని అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ అని కూడా వ్యవహరిస్తారు. ఆ దేశ చట్టం ప్రకారం ఇరాన్‌ సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే అధికారం ఈ గ్రూపునకు ఉంది. ఈ ప్యానల్‌లో ఎనిమిదేళ్ల పదవీకాలం కోసం ఎంపికై వచ్చిన షియా మతగురువులు ఉంటారు. ఈ విభాగమే రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతను పర్యవేక్షిస్తుంది.

మరోవైపు ఖమేనీ స్థానంలో ఇరాన్‌ సుప్రీమ్ లీడర్ గా మొజ్తబా ఖమేనీ నియామితులయ్యారు. ఖమేనీ పెద్ద కుమారుడు మొజ్తాబా. నేడు ఆయన సుప్రీం లీడర్ గా ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఖాళీ అయిన దేశ నాయకత్వ పగ్గాలు మొజ్తాబా చేతికి అధికారికంగా అప్పగించినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రెస్ టీవీ వెల్లడించింది. మోజ్తబా ఖమేనీ 1969లో మషద్ లో జన్మించారు. మతపరమైన ఉన్నత విద్యను అభ్యసించారు. ఇరాన్-ఇరాక్ యుద్ధం చివరి దశలో ‘రివల్యూషనరీ గార్డ్’లో పనిచేశారు. తండ్రికి కుడిభుజంగా వ్యవహరించి పాలనపరంగా తీసుకునే పలు కీలక నిర్ణయాల్లో మొజ్తబా ఖమేనీ ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతారు. 2009లో జరిగిన నిరసన ప్రదర్శనలను అణిచివేయడంలో ఆయన కఠినంగా వ్యవహరించినట్లుగా విమర్శలు ఎదుర్కొన్నారు.

Latest News