విధాత : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala Sitharaman) లోక్ సభలో 2026-27 వార్షిక బడ్జెట్(Union Budget 2026-27)ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను సమర్పించడం విశేషం. నిర్మలమ్మ ఈ దఫా కాంచీపురం చీరను ధరించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఆమె ఆ రాష్ట్రానికి చెందిన కాంచీపురం చీరను ధరించినట్లుగా భావిస్తున్నారు.
అంతకుముందు బడ్జెట్ పత్రాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కేంద్ర మంత్రి అందజేశారు. కేంద్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలిపింది. నిర్మలా సీతారామన్ ఈ దఫా బడ్జెట్ లో 3 కర్తవ్యాలను ప్రకటించారు. కర్తవ్యం-1: సమ్మిళిత ఆర్థిక వృద్ధి, కర్తవ్యం- 2: వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, కర్తవ్యం- 3: ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ సంస్కరణలతో కూడిన అభివృద్ధి మంత్రంగా ఆమె తన ప్రసంగంలో వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో పురోగమిస్తుందని జనవరిలో జీఎస్టీ కలెక్షన్లు రూ. 1.93 లక్షల కోట్లుగా వచ్చిందని, ఎకానమీలో నిలకడ నెలకొందని, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని తెలిపారు.
