Farmers Debts | దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. రైతులను రుణ విముక్తి నుంచి కాపాడుతామని రాజకీయ నేతలు చేసే ప్రసంగాలు, ప్రకటనలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. కానీ ఆ ప్రకటనలు కార్యరూపం దాల్చడం లేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు అరిగోస పడుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో.. అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దేశంలో రైతులు అధికంగా అప్పులు కలిగి ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ ఐదో స్థానంలో ఉంది.
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా.. దేశంలో అన్నదాతల అప్పుల భారంపై టీఎంసీ ఎంపీ కలిపడ సోరెన్ అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలోనే ఏపీ రైతులపై అప్పుల భారం ఎక్కువగా ఉన్నట్లు తేటతెల్లమైంది. 2018 జులై నుంచి 2019 జూన్ మధ్య ఏపీ రైతు కుటుంబం సగటు అప్పు రూ.2,35,554గా ఉంది. అదే తెలంగాణ విషయానికి వస్తే.. 2018 జులై నుంచి 2019 జూన్ నాటికి తెలంగాణ రైతు కుటుంబం సగటు అప్పు రూ.1,52,113గా ఉంది. దేశ వ్యాప్తంగా రైతు కుటుంబం సగటు అప్పు రూ.74,121గా ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
