విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, చైర్మన్ ధన్ఖడ్ల మధ్య సోమవారం చోటుచేసుకున్న సంభాషణ సభలో నవ్వులు పూయించింది. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఖర్గే మాట్లాడుతూ తనకు మోకాళ్ల నొప్పుల కారణంగా ఎక్కువసేపు నిలబడి ఉండలేకపోతున్నానని.. చైర్మన్ అనుమతిస్తే కూర్చొని మాట్లాడతానని విజ్ఞప్తి చేశారు. దీనిపై చైర్మన్ ధన్ఖడ్ స్పందిస్తూ.. ‘‘సభలో ప్రసంగించేటప్పుడు, లేద బయటగాని మీరు ఎలా సౌకర్యవంతంగా ఉంటే అలా మాట్లాడవచ్చని, ఒకవేళ ఇబ్బందిగా ఉంటే మీరు కూర్చొని మాట్లాడవచ్చు. ఆ నిర్ణయం మీదే’’ అని బదులిచ్చారు. కూర్చొని చేసే ప్రసంగం, నిలబడి మాట్లాడి చేసేంత ఉద్రేకంగా ఉండదని ఖర్గే నవ్వుతూ చెప్పారు. విపక్ష నేత మాటలతో చైర్మన్ కూడా ఏకీభవించడంతో వారితో పాటు సాటి సభ్యులు సైతం నవ్వులు చిందించారు. మాట్లాడే విషయంలో నేను సాయం చేస్తా’ అని ధన్ఖఢ్ చెప్పగా.. ‘మీరు సాయం చేస్తారు. మాకు గుర్తుంది కూడా’ అని ఖర్గే బదులిచ్చారు.
అనంతరం తనకు ధన్యవాద తీర్మానంపై మాట్లాడే అవకాశం ఇచ్చిన చైర్మన్కు కృతజ్ఞతలు అంటూ ఖర్గే తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. దాంతో సాటి సభ్యులంతా ఘొల్లున నవ్వారు. దాంతో ‘వీళ్లంతా ఎందుకు నవ్వుతున్నారు..?’ అని ఖర్గే ప్రశ్నించారు. ఆ వెంటనే ‘వీళ్లంతా నన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. దాంతో సభలో మళ్లీ నవ్వలు విరబూశాయి. ఈ సందర్భంగా సోనియాగాంధీ కూడా నవ్వేశారు. ఖర్గే ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘చైర్మన్ కూడా నన్ను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. దాంతో చైర్మన్ దన్కఢ్ నవ్వుతూ.. ‘మేం ఈ వ్యాఖ్యలను డిలీట్ చేస్తాం’ అన్నారు. దాంతో ఈసారి నవ్వడం ఖర్గే వంతయ్యింది. మళ్లీ ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ సందర్భంగా.. ‘నేను ద్వివేది, త్రివేది, చతుర్వేది పేర్లతో అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటా’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.దానికి చైర్మన్ ధన్కఢ్ బదులిస్తూ.. ‘మీరు కావాలంటే ఈ విషయంలో ఒక అరగంట చర్చ పెట్టుకుందాం’ అన్నారు. ఆ తర్వాత ఖర్గే ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్రపతి ప్రసంగం పూర్తిగా ప్రభుత్వ గొప్పలకే సరిపోయిందని విమర్శించారు.