విధాత : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లతో బలహీన పడుతున్న మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శనివారం ఛత్తీస్ గఢ్లోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు (డీకేఎస్జడ్సీఎం) పాపారావు అలియాస్ మోంగు (57) కూడా ఉన్నారు. ఛత్తీస్గఢ్లోని కిష్టారం ప్రాంతానికి చెందిన పాపారావు పార్టీలో హిడ్మా సహా ఇతర ముఖ్య నేతల ఎన్ కౌంటర్లు, లొంగుబాట్ల తర్వాత దక్షిణ బస్తర్లో కీలక నేతగా వ్యవహరిస్తున్నాడు.
పాపారావుపై కోటి రూపాయల వరకు రివార్డు ఉంది. కాగా ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు రెండు ఏకే రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ పి.సుందర్రాజ్ తెలిపారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో నవంబర్ 11న జరిగిన ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న పాపారావు ఇప్పుడు అదే ఏరియాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించడం విశేషం. అప్పటి ఎన్ కౌంటర్ లో మద్దేడు ఏరియా కమిటీ కార్యదర్శి బుచ్చన్నతో పాటు పాపారావు భార్య పామేడు ఏరియా కమిటీ కార్యదర్శి ఊర్మిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.