Modi cabinet : కొత్తగా కొలువుదీరిన కేంద్ర మంత్రివర్గంలో ఏకంగా ఏడుగురు మాజీ సీఎంలకు చోటుదక్కింది. ఈ జాబితాలో గుజరాత్ మాజీ సీఎం నరేంద్ర మోదీతోపాటు.. శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), రాజ్నాథ్ సింగ్ (ఉత్తర్ప్రదేశ్), మనోహర్లాల్ ఖట్టర్ (హర్యానా), సర్బానంద్ సోనోవాల్ (అసోం), హెచ్డీ కుమారస్వామి (కర్ణాటక), జితన్ రామ్ మాంఝీ (బీహార్) ఉన్నారు. వారిలో ఐదుగురు సీఎంలు బీజేపీకి చెందినవారు కాగా కుమారస్వామి, మాంఝీలు జేడీ(ఎస్), హిందుస్థానీ అవామీ మోర్చాకు చెందిన నాయకులు.
ఈసారి కేంద్రమంత్రివర్గంలో దక్షిణాది రాష్ట్రాలకు అత్యధికంగా 12 క్యాబినెట్ బెర్తులు దక్కాయి. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు ఎక్కువ మంత్రి పదవులు దక్కాయి. ఉత్తప్రదేశ్లో 10 మంది, మహారాష్ట్రలో ఆరుగురు మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు. మోదీ మినహా 71 మంది మంత్రుల్లో 11 మంది మిత్రపక్షాలకు చెందినవారు ఉన్నారు. సామాజికవర్గాల వారీగా చూస్తే ఓబీసీలకు 27 మంత్రి పదవులు దక్కాయి. ఎస్సీలు 10, ఎస్టీలు 5, మైనారిటీలు 5 మంత్రి పదవులు దక్కించుకున్నారు.
ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 240 స్థానాలు రాగా, టీడీపీకి 16, జేడీయూకు 12 స్థానాలు దక్కాయి. కూటమి పార్టీలన్నీ కలిసి 293 స్థానాలు దక్కించుకున్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి 232 స్థానాలతో సరిపెట్టుకుంది. మిగతా స్థానాలు ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు.