పిలిస్తే పలికే ఓ చేప రియల్ వండర్ గా నిలుస్తుంది. పెంపుడు కుక్కలు, ఆవులు, ఎద్దులు, వన్యప్రాణుల్లో ఏనుగులు, జల చరాల్లో డాల్ఫిన్లు వంటి జంతువులు పెంపకందారులు పిలిస్తే స్పందించడం సాధారణంగా చూస్తుంటాం. అయితే అనూహ్యంగా ఓ చేప తన నేస్తం రైతు పిలిస్తే చాలు నీటిలో నుంచి పైకి వచ్చి ఆయన చేతుల్లో ఆడి తిరిగి నీటిలోకి వెళ్లిపోయే కథ సోషల్ మీడియాలో తరుచూ వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని యెడే మచింద్ర గ్రామానికి చెందిన రైతు ప్రకాష్ పాటిల్ తాను ‘నారాయణ’ అని పేరు పెట్టిన క్యాట్ ఫిష్ ను తన వ్యవసాయ బావిలో పెంచుకుంటున్నాడు. తొమ్మిదేళ్లుగా ప్రతిరోజూ దాని వద్దకు వెళ్లి నారాయణ అని పిలుస్తూ ఆ క్యాట్ ఫిష్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు.
ప్రతిరోజూ అతను ఆ చేప వద్దకు వెళ్లి భక్తితో నమస్కరించి “నారాయణా” అని పిలువగానే నీటి నుంచి ఆ చేప ఎలాంటి భయం లేకుండా ఆయన దగ్గరకు ఈదుకుంటూ వస్తుంది. చేపను రైతు ప్రకాశ్ తన చేతుల్లోకి తీసుకుని కొద్దిసేపు ప్రేమతో నిమిరి నమస్కరించగానే తిరిగా అది నీటిలోకి వెళ్లిపోతుంటుంది. రైతు ఆ చేపపట్ల నిత్యం చూపిన ప్రేమ, అప్యాయత, భక్తి కారణంగా ఆ చేప ఆయనతో అనుబంధాన్ని, నమ్మకాన్ని పెంచుకుందని విశ్లేషిస్తున్నారు. ఇది చాల అసాధారణమైన ఘటనగా భావిస్తున్నారు. హిందూ సంప్రదాయంలో చేపను విష్ణువు యొక్క మత్స్య అవతారంగా పరిగణిస్తుంటారు. అందుకే ఆ చేపను స్వయం నారాయణ స్వరూపంగా భావిస్తూ రైతు ప్రకాశ్ నారాయణ పేరుతో పిలుస్తూ భక్తితో నిత్యం ఆరాధిస్తుండటం విశేషం. తాజాగా మరోసారి రైతు ప్రకాశ్ పెద్దదైన తన నారాయణ చేపను భక్తితో పిలుస్తున్న వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది.
