విధాత: ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ యూజర్లకు షాక్ ఇవ్వబోతున్నది. సబ్ స్క్రిప్షన్ ప్లాన్ రేట్లను త్వరలో భారీగా పెంచబోతున్నది. ఇప్పటి వరకు పాస్వర్డ్ షేరింగ్ నియంత్రణపై దృష్టి పెట్టిన నెట్ఫ్లిక్స్.. ప్రస్తుతం ప్లాన్పై దృష్టి సారించింది. పాస్ట్వర్డ్ షేరింగ్కు అడ్డుకట్ట వేయడంతో గత త్రైమాసికంలో కంపెనీ 6 మిలియన్ల సబ్ స్క్రైబర్లను పెంచుకుంది. తాజాగా యాఫ్ ఫ్రీ ఆప్షన్ ప్లాన్కు చెందిన ధరలను పెంచబోతున్నట్లు సమాచారం.
అయితే, ఈ వారంలో కంపెనీ త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నది. ఈ క్రమంలో ఫలితాలను ప్రకటించకడంతో పాటు ధరల పెంపుపై సైతం ప్రకటన చేయబోతున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. డిస్నీ తదితర ఓటీటీ సంస్థలు ఇటీవల ధరలను పెంచిన విషయం తెలిసిందే. కానీ, నెట్ఫ్లిక్స్ ధరల పెంపు జోలికి వెళ్లలేదు. వంద మిలియన్ల వ్యూవర్స్ను సాధించాలనే లక్ష్యంతో ముందుకుసాగింది.
అయితే, యాడ్ ఫ్రీ ప్లాన్స్కు చెందిన ధరలను పెంచితే.. యూజర్లు యాడ్ ఆధారిత ప్లాన్స్కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుందని నెట్ఫ్లిక్స్ భావిస్తుంది. ఇదే జరిగితే కంపెనీకి భారీగా లాభం చేకూరనున్నది. ప్రస్తుతం స్టాండర్డ్ యాడ్ ఫ్రీ ప్లాన్స్ రేటు 15.49 డాలర్లు. యాడ్స్ను సపోర్ట్ ప్లాన్ ధర నెలకు 6.99డాలర్లు ఉంది. పాస్వర్డ్ షేరింగ్ను నియంత్రించిన తర్వాత చాలా మంది సబ్స్క్రైబర్లు యాడ్ ఫ్రీ ప్లాన్స్పై దృష్టిపెట్టారు.
ఇప్పటి వరకు స్ట్రయిక్లో ఉన్న హాలీవుడ్ రైటర్స్.. తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మంచి కంటెంట్ వస్తుందని భావిస్తున్న నెట్ఫ్లిక్స్.. ఇదే సమయంలో ప్లాన్ ధరలను పెంచితే బాగుండనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. నెట్ఫ్లిక్ ఆగస్టు-అక్టోబర్ త్రైమాసిక ఫలితాలపై మార్కెట్లో భారీగా అంచనాలే ఉన్నాయి. రెవెన్యూ 7.7శాతం వృద్ధిచెంది.. 8.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.