ఘాజియా బాద్: దేశం లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారాలు జోరుగా చేస్తున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 102 పార్లమెంట్ స్థానాలకు జరుగవలసిన మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19 న ప్రారంభం కానున్నది. దీంతో ఏప్రిల్, 17తో ప్రచారాలకు ముగయనున్నాయి. ఈ క్రమంలో ఆఖరి రోజు ప్రచారాల్లో అధికార , ప్రతిపక్ష పార్టీ లన్నీ ప్రజలను తమ వైపు ఆకర్శించడానికి ర్యాలీలు , రోడ్ షోలు,బహిరంగ సభలు,ఇంటింటి ప్రచారాలు ఇలా ఒకటేమిటీ అన్ని రకాల పద్దతులను అవలంభించాయి. చివరి రోజు ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్వాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ బుధవారం ఘాజియాబాద్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశం లోని ఎన్నికల బాండ్ల స్కామ్ , ఇది ప్రపంచం లోనే అతి పెద్ద స్కామ్ గా పేరు పొందిందన్నారు. ఈ స్కామ్ మూలంగా ఏపార్టీ ఖజానా నిండిదనేది దేశ ప్రజలకు తెలుసన్నారు. అందుకే లంచగొండి తనానికి మారు పేరు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని ఆరోపించారు. నేను తినను తిననివ్వను అని మోదీ ఎన్ని సమర్ధింపులు చేసుకున్నా దేశ ప్రజలకు వాస్తవాలేంటో బాగా తెలుసని రాహుల్ వెల్లడించారు. అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ఘాజియాబాద్ నుండి ఘాజీ పూర్ వరకు బీజేపీ ని ఓడించడమే మా కూటమి ప్రధాన కర్తవ్యమన్నారు . బీజేపీ పాలనతో ప్రజలు విసిగి పోయారని, ఈ సారి ప్రజలు ఇండియా కూటమి వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు.
సీట్ షేరింగ్ విషయంపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. యూపీలో సమాజ్వాదీ, కాంగ్రెస్ ల మధ్య సీట్ల పంపకాలు జరిగాయన్నారు. సమాజ్వాదీ పార్టీకి 62 స్థానాల్లో అవకాశం ఇవ్వగా తృణమూల్ కాంగ్రెస్కు 1 స్థానం, కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు మొత్తం 80 స్థానాలన్నారు. యూపీలో ఇండియా కూటమి ఐఖ్యంగా 80 స్థానాల్లో పోటీ చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తక్కువ స్థానాల్లో పోటీ చేయడంపై రాహుల్ వివరణ ఇస్తూ , ఇది మా బలహీనత అనుకోవద్దు. ఇండియా కూటమి ఐక్యతను చాటి చెప్పడానికి, ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి ఇతరులకు కూడా అవకాశం కల్పంచడానికి మేం ఈ వెసులుబాటు విధానాన్ని అవలంభించామన్నారు. బీజేపీ గెలుపు గురించి రాహుల్ జోస్యం చెబుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి 150 సీట్లకు మించి రావన్నారు.