Site icon vidhaatha

Pune | పిల్లల ముందే మహిళపై వ్యక్తి దాడి … కారుకు సైడ్ ఇవ్వలేదని ఆరోపణ

విధాత, హైదరాబాద్ : తన కారుకు సైడ్‌ ఇవ్వలేదని స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళను తన పిల్లల ముందే ముక్కుపగిలేలా కొట్టాడు ఓ వ్యక్తి. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఈ ఘటనను బాధిత మహిళా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. జర్నిల్‌ డిసిల్వ అనే 27 ఏండ్ల మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటర్‌పై పుణెలోని బనెర్‌-పాషన్‌ రోడ్డుపై వెళ్తున్నారు. ఆమె వెనకాలే దాదాపు 2 కిలోమీటర్ల వరకు కారులో వచ్చిన స్వప్నిల్‌ కెక్రే అనే వ్యక్తి ఆమెను ఓవర్‌టేక్‌ చేశాడు. ఒక్కసారిగా స్కూటీ ముందు కారు ఆపి పిల్లల ముందే డిసిల్వపై దాడి చేసి ముక్కుపై పిడిగుద్దులు కురిపించడం ప్రారంభించాడు. తీవ్రంగా కొట్టడంతో ఆమె ముక్కు నుంచి రక్తస్రావమైంది. కారుకు దారివ్వలేదని ఆరోపిస్తూ తనపై దాడికి పాల్పడ్డాడని ఆ వీడియోలో పేర్కొన్నారు. జుట్టు పట్టుకొని విచక్షణారహితంగా ముఖంపై కొట్టడని చెప్పారు. ఆయనతోపాటు కారులో మరో వ్యక్తి కూడా ఉన్నాడని తెలిపారు. పుణెలో భద్రత ఎక్కుడుందని ప్రశ్నించారు. తనలాగే మరొకరికి జరగొచ్చని, పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అదికాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. అది పోలీసుల దృష్టికి వెళ్లింది. రంగంలోకి దిగన పోలీసులు జర్నిల్‌ ఇంటికి వెళ్లారు. ఆమె నుంచి వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన నిందితుడితోపాటు ఆ సమయంలో కారులో ఉన్న అతని భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version