Mobile Phone | ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ యుగమైపోయింది. పసిబిడ్డ నుంచి మొదలుపెడితే వృద్ధుడి వరకు అందరి చేతుల్లో మొబైల్ ఫోన్లు కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ ఫోన్ల( Mobile Phone ) వాడకం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా మైనర్లు మొబైల్ ఫోన్లు వినియోగించడం వల్ల చెడిపోతున్నారనేది నగ్న సత్యం. దీంతో చాలా మంది పేరెంట్స్( Parents ) తమ పిల్లలకు మొబైల్ ఫోన్లను దూరంగా ఉంచుతున్నారు. అయినా కూడా దొంగచాటుగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తూ సమయాన్ని వృథా చేస్తూ, చెడు వ్యసనాల బారిన పడుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న ఓ గ్రామ పెద్దలు పిల్లలు మొబైల్ వినియోగంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆ కఠిన నిర్ణయం ఏంటంటే..?
మహారాష్ట్ర( Maharashtra ) అహ్మద్నగర్ జిల్లాలోని నెవాసా తాలూకాలోని సౌందాల గ్రామం( Saundala Village )లో సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం గ్రామపంచాయతీలో జాతీయ గీతాలాపన చేస్తున్నారు. ఈ సమయానికి ఎక్కడి వారు అక్కడ నిల్చొని జాతీయ గీతాలాపన చేయాలి. దీంతో ప్రతి ఒక్కరిలో దేశ భక్తి పెంపొందిస్తున్నట్లు గ్రామ పెద్దలు పేర్కొంటున్నారు.
మొబైల్ కనిపిస్తే వారికి రూ. 500 జరిమానా
ఇక పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకున్న గ్రామ పెద్దలు కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 7 గంటల తర్వాత విద్యార్థులకు వారి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు ఇవ్వడాన్ని నిషేధించారు. ఈ నిబంధనకు విరుద్ధంగా ఎవరి చేతిలోనైనా మొబైల్ కనిపిస్తే వారికి రూ. 500 జరిమానా విధిస్తారు. విధించారు కూడా. అదేవిధంగా, గ్రామాన్ని బాల కార్మిక రహితంగా మార్చాలని కూడా నిర్ణయించారు. బాల కార్మికుల గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.1000 బహుమతిగా అందిస్తున్నారు.
కట్నంపై కఠిన నిబంధనలు..
వీటితో పాటు గ్రామ పంచాయతీ మరో ప్రత్యేక చొరవ కూడా తీసుకుంది. అదేంటంటే, గ్రామంలో కట్నం డిమాండ్ చేసే వారిపై కఠిన నియమ నిబంధనలను పాటిస్తున్నారు. ఎవరైనా కట్నం అడిగినట్లు తమ దృష్టికి తీసుకువస్తే రూ.5000 బహుమతిగా ఇస్తామని పంచాయతీ సభ్యులు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం గృహ హింసను కూడా నివారిస్తుందని సర్పంచ్ శరద్ అర్గాడే అభిప్రాయపడ్డారు.
