విధాత: జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి ఆ దేశ పర్యాటక రంగాన్ని అథఃపాతాళానికి పడేస్తుంది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26మంది చనిపోవడంతో భయభ్రాంతులకు గురైన పర్యాటకులు ఆ రాష్ట్రం నుంచి వెనుతిరిగి పోతున్నారు. కేవలం 6 గంటల వ్యవధిలోనే 3,300 మంది శ్రీనగర్ను వీడినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు సొంత ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యారు. జమ్మూకశ్మీర్ ను వీడుతున్న పర్యాటకుల కోసం శ్రీనగర్ నుంచి సురక్షిత ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
విమానాశ్రయంలో రద్దీ దృష్ట్యా ప్రత్యేక సదుపాయాలు కల్పించామని.. ఆహారం, నీరు వంటి వసతులు కల్పిస్తున్నామన్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ ఎయిర్పోర్టు నుంచి 20 విమానాలు వెళ్లాయి. 3,337 మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని వీడారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు విమానాలు అందుబాటులో ఉంచాం. టికెట్ ధరలు పెంచొద్దని విమానయాన సంస్థలను ఆదేశించాం. ఇప్పటికే అన్ని ఎయిర్లైన్లు టికెట్ క్యాన్సిలేషన్, రీషెడ్యూల్ ఛార్జీలను రద్దు చేశాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో మనమంతా పర్యటకులకు అండగా నిలవాలి’’ అని కేంద్రమంత్రి తన పోస్ట్లో పేర్కొన్నారు.
పర్యాటకుల నిష్క్రమణ బాధాకరం : సీఎం ఒమర్ అబ్దుల్లా
ఉగ్రదాడి నేపథ్యంతో భయాందోళనకు గురైన పర్యాటకులు వేలాది మంది జమ్మూకశ్మీర్ నుంచి వెళ్లిపోతుండటం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్ లోయ నుంచి అతిథులు వీడుతుంటే నా హృదయం ద్రవిస్తోంది. అయితే వారు ఎందుకు వెళ్లిపోవాలనుకుంటున్నారనేది నేను అర్థం చేసుకోగలను. పర్యాటకుల తిరుగు ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్రం కల్పించిన అదనపు విమానాలతో పాటు రోడ్డు మార్గంలోనూ ప్రయాణ సౌకర్యాలు కల్పించాం’’ అని సీఎం వెల్లడించారు. కశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన దాడితో ఆ రాష్ట్ర పర్యాటక రంగం భారీగా నష్టపోనుంది. ముఖ్యంగా పర్యాటక ఆదాయంపై ఆధారపడిన రాష్ట్ర ఆర్థిక స్థితి, పర్యాటక ప్రాంతాల్లోని ప్రజల లావాదేవిలు తీవ్రంగా దెబ్బతినడం స్థానికులను ఆలోచనలో పడేస్తుంది.