Komatiredddy Rajagopal Reddy | విధాత, హైదరాబాద్ : అసెంబ్లీలో ఇదే నా చివరి రోజని…ఈ సమావేశాల తర్వాతా ఇకపై నేను అసెంబ్లీ సమావేశాలకు రానని..ఇకపై ప్రజల్లోనే ఉంటానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున ఆయన గన్ పార్కు అమరవీరుల స్థూపం వద్ధ నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు తన సొంత నియోజకవర్గం మునుగోడు నుంచి నేరుగా ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందని..అమరవీరుల స్థూపం మాకు గుడి వంటిదన్నారు. అమరవీరులు ప్రజల గుండెల్లో ఉంటారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు, రైతుల వరదలతో నష్టపోయి ఉన్నారని..వారికి అధికార పార్టీ అండగా నిలవాల్సిన అవసరముందని..ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు రానవసరం లేదన్నారు. ఇలాంటి సమయంలో అసెంబ్లీకి రావడం తనకు ఇష్టం లేదని.. .కామరెడ్డి, మెదక్, వరంగల్ , ఖమ్మం జిల్లాల్లో వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు వీలైన సహాయం చేస్తానన్నారు.
మంత్రి పదవి ఆశించి భంగపడిన రాజగోపాల్ రెడ్డి తరుచూ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వరదల సమయంలో అసెంబ్లీ సమావేశాలు పెట్టడం సరైంది కాదని..త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందంటూ తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి పదవిలో ఉన్నారన్నట్లుగా పరోక్ష వ్యాఖ్యలు చేయడం దూమారం రేపింది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవచ్చన్న ప్రచారానికి ఊతమిచ్చేదిగా ఉన్నాయని అనుచరవర్గాలు విశ్లేషిస్తున్నాయి.