విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: బీజేపీని వీడుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆపార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇతర పార్టీలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదన్నారు.
చుట్టూ ఉన్న సమాజం కోసం నావంతు మంచి చేయాలనే లక్ష్యంతో రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఎంపీ పదవికి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సాధనలో తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించానన్నారు. సబ్బండ వర్గాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు నన్నెంతో కలచివేశాయన్నారు.
ప్రజా తెలంగాణ బదులు, ఒక కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్లు పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న తప్పుడు వార్తలను ఆయన ఖండించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షల మేరకు ముందుకు నడిపించే సత్తా మోడీ, అమిత్ షా కే ఉందని విశ్వసించి, దేశ సౌభాగ్యంలో నేను కూడా భాగస్వామి కావాలని అడుగు వేశానన్నారు.
నేనే కాదు ఇతర ముఖ్య నాయకులు ఎవరు బీజేపీని వీడరని చెప్పారు. కేసీఆర్ కుటుంబం పాలన అంతమొందించే దిశగా భారతీయ జనతా పార్టీ సైనికులై ముందుకు కదులుతామన్నారు.