విధాత: తమిళనాడు ప్రభుత్వం ఆలయాలకు భక్తులు సమర్పించిన వేయి కిలోలకు పైగా బంగారు కానుకలను కరిగించడం ఆసక్తి రేపింది. తమిళనాడులోని 21 ఆలయాలకు భక్తులు సమర్పించిన..నిరుపయోగంగా ఉన్న 1,000 కిలోలకు పైగా బంగారు వస్తువులను కరిగించింది. ఆ బంగారాన్నంతా 24 క్యారెట్ల కడ్డీలుగా మార్చింది. ప్రభుత్వం వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయగా ఏటా రూ.17.81 కోట్ల వడ్డీ వస్తోందని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.
కాగా ‘గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్’లో భాగంగా రాష్ట్రంలోని 38,000 దేవాలయాల అదనపు బంగారు కానుకలను బార్లుగా కరిగించనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. భక్తులు సమర్పించే అదనపు బంగారాన్ని ముంబైలోని ప్రభుత్వ మింట్లో కరిగించి కడ్డీలుగా మార్చాలని నిర్ణయించింది. వచ్చిన స్వచ్ఛమైన బంగారు కడ్డీలను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి.. తద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలో విద్యా సంస్థల స్థాపన, నిర్వహణకు ఉపయోగిస్తామని ప్రకటించారు.
ఈ క్రమంలో ఏటా ఆలయాల అవసరాలకు పోను అదనంగా ఉన్న బంగారు కానుకలను ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కు ఉపయోగిస్తుంది. ఈ ప్రక్రయపై హిందూ సంఘాల నుంచి, న్యాయస్థానాల నుంచి ఎదురైన అభ్యంతరాలను సైతం అధిగమించి స్టాలిన్ ప్రభుత్వం ముందుకెలుతోంది.