ఫార్మాసిటీ భూముల్లో రియల్ వ్యాపారం
రేవంత్ రెడ్డి విజన్ లేని నాయకుడు
విధాత : సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ విజన్ లేని నాయకుడు అని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజాధనం వృధా అవుతూందని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారని కేటీఆర్ విమర్శించారు. కేవలం రేవంత్ కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసమే హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆశ నేరవేరదని పేర్కొన్నారు.
ఫార్మా సిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 56 గ్రామాల పరిధిలో హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం 20వేల ఎకరాలతో తయారు చేసిందని, స్థానిక రైతులు రాష్ట్ర ప్రయోజనా కోసం ప్రభుత్వంతో కలిసి వచ్చి తమ భూములు ఫార్మాసిటి కోసం ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే, కొందరు భూములు ఇవ్వడానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత భూములు తిరిగి రైతులకు ఇస్తామని హామీలు ఇచ్చారన్నారు. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు స్నేహితుల కోసం అవే భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రైతులను మోసం చేశారని విమర్శించారు. దీంతో ఫార్మా సిటీ నిర్మాణ పెట్టుబడులు వెనక్కి పోయి.. లక్షల ఉద్యోగాల కల్పన ఆగిపోయిందని కేటీఆర్ వెల్లడించారు.