BRS MLC Kavitha | రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్లు బీసీల రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మంగళవారం తెలుగు యూనివర్సిటీలో మహాకవి దాశరధి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలకు హాజరైన సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభ, మండలిలో ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం పంపిందని.. కానీ రిజర్వేషన్లకు మతం రంగు పులిమి రాష్ట్రపతి వద్దకు కేంద్ర ప్రభుత్వం పంపలేదని కవిత ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి ఓట్లు రావని తెలిసే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు రిజర్వేషన్ల బిల్లు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చలేమని మాట్లాడారని విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేస్తూ, దక్షిణాది రాష్ట్రాల్లో న్యాయపరమైన సమస్యలు అంటూ దాటవేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికి 50సార్లు పైగా ఢిల్లీ వెళ్లారని.. కానీ రిజర్వేషన్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఒత్తిడి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి, 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటీషన్ వేసి, రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి, చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. దాశరథి శత జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు నగదు పురస్కారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా కవిత తెలిపారు.
BRS MLC Kavitha | రిజర్వేషన్లకు మతం రంగు పులిమిన బీజేపీ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజం
