విధాత, హైదరాబాద్ : ఎన్టీఆర్ జిల్లా బోదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన ప్రమాదంలో బాయిలర్ పేలి 20 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగ్రాతులు బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలుగా గుర్తించారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట , విజయవాడ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
బోదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన బాయిలర్ పేలి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. బాధితులకు అండగా నిలబడాలని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పేలుడు ఘటనకు కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలిపారు. ప్రమాద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడాలని అన్నారు. ప్రభుత్వం నుంచి కూడా సాయం అందిస్తామని సీఎం పేర్కొన్నారు.
బోదవాడలో పేలిన బాయిలర్,20మంది కార్మికులకు గాయాలు … సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఆదేశాలు
