Gautam Adani Under US SEC Scanner Again After Hindenburg Report Impact
- భారత ప్రభుత్వంతో సంబంధం లేకుండానే
- కుప్పకూలిన అదానీ గ్రూప్ షేర్లు
- కొంపముంచిన హిండెన్ బర్గ్ నివేదిక
విధాత భారత్ డెస్క్ | హైదరాబాద్:
Adani Case – US SEC Summons | ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదాని, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ లకు అమెరికాకు చెందిన సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) రెండోసారి సమన్లు జారీ చేసింది. అవి కూడా వయా భారత ప్రభుత్వం ద్వారా కాకుండా నేరుగా గౌతమ్ అదానీ కంపెనీ ఈ మెయిల్ కు పంపంచడం పారిశ్రామిక వర్గాల్లో సంచనం కలిగిస్తోంది. మోసం, లంచం కేసులో ఈ సమన్లు జారీ అయ్యాయి. మొదటి సారి అధికారిక ముద్రలు, సంతకాలు లేకుండా జారీ చేసిన సమ్మన్లు స్వీకరించేందుకు అదానీ బ్రదర్స్ నిరాకరించడంతో అమెరికా ప్రభుత్వానికి కోపం తెప్పించింది. ఈసారి తప్పించుకోకుండా ఉండేందుకు ఏకంగా వారి ఈ మెయిళ్లకు పంపించడం విశేషం.
ఎస్ఈసీ ఆగ్రహం… కోర్టు అనుమతితో నేరుగా ఈమెయిల్ సమన్లు
గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు గతేడాది మే నెలలో తొలిసారి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ కమిషన్ సమ్మన్లు జారీ చేసింది. ఈ సమన్లను భారత ప్రభుత్వ న్యాయ శాఖ ద్వారా జారీ చేశారు. జారీ చేసిన సమన్లలో అధికారిక సీళ్లు, సంబంధిత అధికారుల సంతకాలు లేవని స్వీకరించేందుకు గౌతమ్, సాగర్ అదానీలు నిరాకరించారు. ఈ విషయమై గత డిసెంబర్ నెలలో న్యూయార్క్ ఫెడరల్ కోర్టును ఎస్ఈసీ ఆశ్రయించింది. సమన్లు స్వీకరించనందున అంతర్జాతీయ ఒప్పందాలతో సంబంధాలు లేకుండా నేరుగా వారి ఈ మెయిళ్లకు పంపించేందుకు అనుమతించాల్సిందిగా కోరారు. ఎస్ఈసీ వినతికి ఫెడరల్ కోర్టు సమ్మతించడం జరిగింది. దీంతో గౌతమ్, సాగర్ లకు నేరుగా ఈ మెయిల్ ద్వారా సమన్లు జారీ చేసింది. ఈ సమన్లతో రెండు రోజుల క్రితం అదానీ గ్రూపు కంపెనీల షేర్లు 3.3 శాతం నుంచి 14.6 శాతం వరకు షేర్ మార్కెట్ లో నష్టాలను చవిచూశాయి.
పునరుత్సాదక ఇంధన ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ప్రభుత్వ అధికారులకు 26.5 కోట్ల డాలర్లు లంచాలు ఎరగా వేశారనే ఆరోపణలపై 2024 నవంబర్ 20న గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై అమెరికా క్యాపిటల్ నియంత్రణ మండలి అయిన సెక్యురిటీస్ అండ్ ఎక్చేంజి కమిషన్ అభియోగాలు మోపింది. హేగ్ ఒప్పందం ప్రకారం పంపించాల్సి ఉందని, నిర్ణీత గడువు అంటూ లేదని కమిషన్ న్యూయార్క్ లోని ఫెడరల్ కోర్టుకు తెలిపింది. లంచాలు ఇచ్చిన విషయాన్ని దాచిపెట్టి 2021లో అదానీ గ్రూపు కంపెనీ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా మార్కెట్ నుంచి రుణ పత్రాల ద్వారా భారీగా నిధులు సమకూర్చుకోవడంతో కమిషన్ లోతుగా విచారించి కేసు నమోదు చేసింది.
హిండెన్బర్గ్ ప్రభావం… అదానీ షేర్లకు భారీ దెబ్బ
ప్రపంచ దేశాలు గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ రంగంలో ప్రవేశించేందుకు అదానీ గ్రూపు తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశంలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తమకు పోటీ లేకుండా చేసుకునేందుకు అదానీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, ఒడిశా, జమ్మూ, కాశ్మీర్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ప్రభుత్వ అధికారులకు వేల కోట్ల రూపాయలు లంచాలు ముట్టచెప్పినట్లు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) తన నివేదికలో వెల్లడించింది. రానున్న రెండు దశాబ్ధాల్లో తక్కువలో తక్కువ 2 బిలియన్ డాలర్లు లబ్ధి పొందేందుకు ప్రయత్నించిందని ఆరోపించింది. ఈ లంచాల సొమ్మును సేకరించేందుకు పెట్టుబడిదారులు, బ్యాంకులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేసే ప్రయత్నాలు చేసినట్లు పేర్కొంది. తప్పుడు సమాచారం చూపించి రెండు బిలియన్ డాలర్ల మేర రుణాలకు దరఖాస్తు చేయడం, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సంస్థలు ఇచ్చిన భరోసాను చూపించి యూఎస్ తోపాటు ఇతర దేశాల మదుపర్లకు ఒక బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను ఆఫర్ చేశారని వివరించింది. ఈ కేసులో ఎఫ్.బీ.ఐ, ఎస్ఈసీ దర్యాప్తును అడ్డుకోవడానికి కుట్ర పన్నినట్లు ఫెడరల్ కోర్టు పేర్కొనడం గమనార్హం. మూడు సంవత్సరాల క్రితం అమెరికా దేశానికి చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చి సంస్థ అదానీ గ్రూపులో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఇన్విస్టిగేటివ్ కథనం వెలుగులోకి తెచ్చింది. ఈ కథనం అప్పట్లో దేశంలో సంచలనం రేపింది. తాజా ఎస్ఈసీ సమన్ల ప్రభావంతో రెండు రోజుల క్రితం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు 3.3 శాతం నుంచి 14.6 శాతం వరకు పడిపోయాయి. ముఖ్యంగా అదానీ గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతిన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు ఒకేసారి రంగంలోకి దిగడంతో అదానీ గ్రూప్కు ముందున్న రోజులు మరింత కఠినతరంగా మారనున్నాయి. ఈ కేసులు ఏ దిశగా మలుపు తిరుగుతాయన్నది దేశీయ, అంతర్జాతీయ వ్యాపార రంగం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
