MGNREGA | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం వీబీజీ రామ్ జీ.. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉందని, దీంతో పని దినాలు కూడా తగ్గుతాయన్నారు. ఉపాధి హామీ పథకం పై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చిందన్నారు. పేదరికం, నిరుద్యోగం, వలసలు, నైపుణ్యం లేని శ్రామిక వర్గాల దోపిడీ, స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలులోకి వచ్చిందని ఆయన వివరించారు.
ప్రస్తుతం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) చట్టం-2025 పేదల హక్కులను దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడిన గ్రామీణ ప్రాంత మహిళలు, బలహీనవర్గాల ఉపాధికి హామీ లేకుండా చేస్తోందన్నారు. పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే నిబంధనలు పేదల పాలిట శాపంగా మారనున్నాయన్నారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 100 రోజుల ఉపాధి కల్పించి, కనీస వేతనం అందించే గ్యారంటీ ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో లబ్ధి పొందిన వారిలో సుమారు 90 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలున్నారు. వీరిలో 62 శాతం మహిళలు లబ్ధి పొందారు. దళితులు, గిరిజనులు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు, చెంచులు, పేద వర్గాలే ఎక్కువగా ప్రయోజనం పొందారని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ కారణాలతో తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించటంతో ఆయన స్ఫూర్తిని నీరుగార్చినట్లయింది. కొత్త చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉందని, ఉపాధి హామీ చట్టం యొక్క అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. డిమాండ్ అనుగుణంగా పనుల ప్రణాళికను తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది. డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలి.
- కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉంది.
- నిన్నటి వరకు అమల్లో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దాదాపు 62 శాతం మహిళలు కూలీ పొందేవారు.
- కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత (నార్మేటివ్) కేటాయింపుల విధానం వల్ల పని దినాలు తగ్గిపోతాయి.
- దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు నష్టపోతారు. మహిళా సాధికారత సాధించాలంటే పాత విధానం పునరుద్ధరించాలి.\
- పాత ఉపాధి హామీ పథకంలో పూర్తిగా కేంద్రమే నిధులు కేటాయించేది. కొత్త చట్టం ద్వారా కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్ర నిధుల వాటా 40గా మార్చటం సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తుంది.
- ఇది రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది.
- పాత నిధుల వాటా నమూనాను పునరుద్ధరించాలి.
- వ్యవసాయ సీజన్ లో 60 రోజుల విరామం తప్పనిసరిగా విధించడంతో భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుంది.
- ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాలి.
- ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా 266 రకాల పనులు చేపట్టే వెసులుబాటు ఉంది.
- కొత్త చట్టంలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులు తొలిగించటంతో చిన్న సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు నష్టపోతారు.
- ఇప్పుడున్న పనుల జాబితాను యథాతథంగా అనుమతించాలి.
ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని, పాత చట్టంలో నిర్దేశించిన ఉద్దేశాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని కూలీ కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఈ సభ తీర్మానించింది.
