Telangana Journalist Accreditation Cards : తెలంగాణ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు

తెలంగాణలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మీడియా ప్రతినిధులకు తాత్కాలిక ఊరట లభించింది.

Journalists Accreditation Cards

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, అక్రిడిటేషన్ కార్డుల నిబంధనల మార్పులపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని ఆదేశించింది. ఈ మధ్యంతర ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రిడిటెడ్ జర్నలిస్టులు ప్రభుత్వ కార్యక్రమాలు, సౌకర్యాలను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించవచ్చని పేర్కొంది.

ఈ పిటిషన్‌లో, జీఓ 252, సవరించిన జీఓ 103 వల్ల జర్నలిస్టుల వృత్తి కార్యకలాపాలు, సదుపాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఫెడరేషన్ పేర్కొంది. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది అడ్వొకేట్ బర్కత్ అలీ ఖాన్ వాదనలు వినిపించారు.

విచారణ సందర్భంగా స్పెషల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరణ ఇస్తూ, జర్నలిస్టుల వృత్తి కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు తాత్కాలికంగా రెండు నెలల పాటు అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వాదనలను రికార్డులోకి తీసుకున్న హైకోర్టు, ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డులు 2026 ఏప్రిల్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. అలాగే, జీఓ 252, సవరించిన జీఓ 103 పై లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం పూర్తి స్థాయి వివరణ సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాతకు వాయిదా వేసింది.

తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ సయ్యద్ ఘౌస్ ముహియుద్దీన్ అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడగింపును స్వాగతిస్తూ, ఇది తాత్కాలిక ఊరట మాత్రమేనని, జర్నలిస్టులకు న్యాయం సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

ప్రతిభ కబనబరిచిన పోలీసు జాగిలం భైరవ్ కి గోల్డ్ మెడల్ 
Odisha Ganja Seizure | రూ.200 కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌

Latest News