అమరావతి : ఇండిగో విమానాల సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. విమానాల రద్దు, ఆలస్యం వల్ల సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఇండిగో ఎయిర్ లైన్స్ బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించారు. ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తూ వారి ధనాన్ని దోచేస్తోందని ఆరోపించారు. విమానయాన రంగంలో పబ్లిక్ సెక్టార్ రంగాన్ని కేంద్రం నాశనం చేసిందని..కేంద్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతుందన్నారు. ప్రైవేటు రంగంలో విమానయాన నిర్వహణలో బాధ్యతారాహిత్యాన్ని ఇండిగో ఉదంతం నిదర్శనమన్నారు. వెంటనే ఇండిగో ఎయిర్లైన్స్ ను కేంద్రం ఆధీనంలోకి తీసుకుని నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. 2వేల విమాన సర్వీస్ లు రద్దవ్వడంతో ఐదు రోజులుగా ఎయిర్ పోర్టులలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇదే అదనుగా టికెట్ల ధరలు పదింతలు పెంచి దోచుకుంటున్నారు. ఇండిగో విమాన సర్వీస్ ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. ఈ సంక్షోభంపై నిజానిజాలు తేల్చేందుకు పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. సంక్షోభానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
