Narayana | హైదరాబాద్ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడిని సీపీఐ నారాయణ తీవ్రంగా ఖండించారు. ఇది రాజ్యాంగ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై దాడి అని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యంత ఉన్నత న్యాయస్థానంలోనే సీజేఐకి రక్షణ లేకపోతే ఈ దేశం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
సనాతన ధర్మం కాలం చెల్లిందని తన అభిప్రాయం చెప్పిన సీజేఐపై దాడి చేయడం దారుణం అని నారాయణ మండిపడ్డారు. సనాతన ధర్మం గురించి పదే పదే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. సనాతన ధర్మం ఎంత ప్రమాదమో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. జస్టిస్ గవాయ్పై దాడిని పవన్ ఖండించాలి. దాడికి యత్నం చేసిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలి అని నారాయణ డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగుతుండగా సీజేఐ గవాయ్పై ఓ న్యాయవాది బూట్ విసిరేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకుని, బయటకు తరలించారు. నిందితుడు రాకేశ్ కిశోర్(71)ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. ఘటనపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అతడికి నోటీసులు జారీచేయనున్నట్టు తెలిపింది.