తొలి దశలో ఆరు కోర్సుల నిర్వాహణ
CS Shanti Kumari | సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలతో రూపు దిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా పలు రంగాల్లో కోర్సులను దసరా పండగ నుంచి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాదాపు 20 కోర్సులను నిర్వహించాలని గుర్తించడం జరిగిందని, వీటిలో దసరా పండగ నుంచి ప్రాథమికంగా ఆరు కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. శనివారం స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై నేడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారని, ఈ నిర్మాణ పనులు ముగిసేంత వరకు ఈ యూనివర్సిటీని తాత్కాలిక భవనంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకు గాను ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ అఫ్ ఇండియాగాని, నాక్ లేదా నిథమ్ లో నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఈ యూనివర్సిటీ చైర్ పర్సన్ గా ఆనంద్ మహేంద్రను, శ్రీనివాస రాజు ను కో-చైర్మన్ గా నియమించడం జరిగిందని గుర్తు చేశారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దాదాపు 140 కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయని, దాదాపు 20 కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించగా.. తొలుత స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలోనూ సర్టిఫికెట్ కోర్స్ లు, డిప్లొమా కోర్సులను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. యూనివర్సిటీ కి సంబందించిన లోగో ను, వెబ్ సైట్ ను ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి ఆకర్షణీయమైన వేతనంతో కూడిన ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఎస్బీఐ, నాక్, డాక్టర్ రెడ్డీస్, ఆదానీలు భాగస్వాములుగా ఉండేందుకు అంగీకరించారని వీరితోపాటు సీఐఐ కూడా ముందుకు వచ్చిందని వెల్లడించారు.