ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా 8 రాష్ట్రాలకు కేటాయింపు
Ecms Scheme | ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్ (ECMS) కింద కేంద్ర ప్రభుత్వం మూడో విడతలో 22 కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలియజేసింది. ఈ ప్రాజెక్టులు మొత్తం 11 ఉత్పత్తి విభాగాలను కవర్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దేశవ్యాప్తంగా రూ.41,863 కోట్ల మేరకు పెట్టుబడులు వస్తాయని, రూ.2,58,152 కోట్ల ఉత్పత్తి సాధ్యమవుతుందని కేంద్రం అంచనా వేస్తున్నది. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే సుమారు 33,791 కొత్త ఉద్యోగాలను సృష్టించనున్నాయి. ఫాక్స్కాన్.. తమిళనాడులో ఏర్పాటు చేయనున్న మొబైల్ ఎన్క్లోజర్ ప్రాజెక్టు ఒక్కటే సుమారు 16,200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి ఎలక్ట్రానిక్ భాగాలను భారతదేశం దిగుమతి చేసుకుంటూ వస్తున్నది. ఈ ప్రాజెక్టులు అమల్లోకి రావడంతో ఆ భారం కూడా తగ్గనున్నది. దేశంలోనే అధిక విలువ కలిగిన తయారీ సామర్థ్యం పెరుగుతుందని కేంద్రం చెబుతున్నది. అంతేకాక.. గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్లో కీలక పాత్రధారి కావాలన్న భారత ఆకాంక్షలు కూడా నెరవేరనున్నాయి. తాజాగా ఆమోదం పొందిన కంపెనీల్లో ఫాక్స్కాన్, సామ్సంగ్ డిస్ప్లే నొయిడా, టాటా ఎలక్ట్రానిక్స్, డిక్సన్ టెక్నాలజీస్, హిండాల్కో వంటి భారీ సంస్థలు ఉన్నాయి.
ఇంతటి కీలకమైన ప్రాజెక్టులు మాత్రం కేంద్రం తన రాజకీయ అవసరాల మేరకు ఆయా రాష్ట్రాలకు కేటాయించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం ఎనిమిది రాష్ట్రాలకే ఈ ప్రాజెక్టులన్నీ పంచేయగా.. తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఒకటి కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. పరిశ్రమలు అన్ని ప్రాంతాల్లో విస్తరించాలనే లక్ష్యంతో ఈ విధమౌన భౌగోళిక పంపిణీ చేపట్టామని కేంద్రం సమర్ధించుకుంటున్నది.
యాపిల్ సరఫరా సంస్థలకే పెద్ద వాటా
ఈసీఎంఎస్ తాజా విడుతలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో యాపిల్ తయారీ ఎకోసిస్టమ్కు చెందిన కంపెనీలే ఎక్కువగా ఉండటం గమనార్హం. వీటిలో కొన్ని సంస్థలు యాపిల్ గ్లోబల్ సప్లై చైన్లో భాగంగా మారనున్నాయి. కొన్ని కంపెనీలు విదేశాలకు కూడా ఎలక్ట్రానిక్ భాగాలను ఎగుమతి చేయనున్నాయి.
యాపిల్కు అనుబంధంగా ఉన్న కీలక సంస్థలు:
మదర్సన్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్
టాటా ఎలక్ట్రానిక్స్
ఏటీఎల్ బ్యాటరీ టెక్నాలజీ ఇండియా
ఫాక్స్కాన్కు చెందిన యుజాన్ టెక్నాలజీ ఇండియా
హిండాల్కో ఇండస్ట్రీస్
ఎన్క్లోజర్లు, పీసీబీల్లో భారీ పెట్టుబడులు
తాజా విడతలో ఎన్క్లోజర్ల విభాగానికే అత్యధిక పెట్టుబడులు వెళ్లనున్నాయి. మూడు ప్రాజెక్టుల ద్వారా రూ.27,166 కోట్లు పెట్టుబడి రానుంది. మొబైల్ ఫోన్లు, చేతిలో ఇమిడే ఎక్ట్రానిక్ పరికరాల లోపలి భాగాలను కాపాడే వ్యవస్థే ఈ ఎన్క్లోజర్లు. మరోవైపు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ (PCB) విభాగంలో తొమ్మిది ప్రాజెక్టులకు రూ.7,377 కోట్లు కేటాయించారు. పీసీబీలు.. మొబైల్ ఫోన్స్, గృహోపకరణాలు, వాహన ఎలక్ట్రానిక్స్లో కీలక పాత్ర పోషిస్తాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, పవర్ బ్యాంకులు తదితర పరికరాలకు అత్యంత కీలకమైన లిథియం–అయాన్ బ్యాటరీల తయారీ ప్రాజెక్టుకు 2,922 కోట్లకు ఆమోదం లభించింది. నున్నాయి.
