విధాత, హైదరాబాద్ : తనకు ఏ ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం అవసరం లేదని, నేను ఏ ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఏమీ అడగలేదని భారత మాజీ క్రికెటర్ అంబంటి రాయుడు ట్విటర్ వేదికగా తేల్చి చెప్పారు. రాయుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం క్రికెటర్ మహ్మద్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్లకు డిఎస్పీ ఉద్యోగాలు, ఇంటి స్థలం కేటాయించిన సందర్భంగా అసెంబ్లీలో బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మాజీ క్రికెటర్లు మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓఝా, అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకు కూడా ఇంటి స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన అంబటి రాయుడు తాజాగా ఎక్స్లో స్పందించారు. ఎమ్మెల్యే కౌశిక్ తన పేరును ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా అవసరమేనని, మహ్మద్ సిరాజ్ చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఇంటి స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో కేవలం క్రికెటర్లకే కాకుండా మిగతా క్రీడాకారులకు అంతే సమానంగా గౌరవం దక్కడం చాలా ముఖ్యమైన అంశమని అంబటి రాయుడు పేర్కొన్నారు. తనకు ఏ ప్రభుత్వం నుంచి కూడా స్థలం అవసరంలేదని, నేను ఏ ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఏమీ అడగలేదని రాయుడు ట్వీట్లో స్పష్టం చేశారు.