విధాత, హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్ధిస్తూ ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు కల్పిస్తూ సుప్రీం కోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజార్టీతో ఇచ్చిన తీర్పు పట్ల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుతో మంద కృష్ణ మాదిగ భావోద్వేగానికి లోనయ్యారు. కోర్టు ముందు మీడియా ఎదుట ఆయన కంట నీరు పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మా 20 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందని, సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందని వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధానంగా చొరవ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులు అమిత్షా, కిషన్ రెడ్డిలకు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నామని మందకృష్ణ మాదిగ చెప్పుకొచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటంలో చాలా మంది అసువులు బాశారని.. వర్గీకరణ ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకు ఎన్నో కుట్రలు చేశారని అవేదన వ్యక్తం చేశారు. కానీ మొక్కవోని ధైర్యంతో ఏమాత్రం సహనం కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాదించామన్నారు. న్యాయం కోసం ఎమ్మార్పీఎస్కు అండగా నిలబడిన వారందరికీ ఈ విజయం అంకితమని మంద కృష్ణ మాదిగ అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
SC and ST Reservations | మంద కృష్ణ భావోద్వేగం..కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు
