న్యూఢిల్లీ: తెలంగాణకు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. మంగళవారం ఆయన ఢిల్లీలో నడ్డాతో సమావేశమయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎంలో 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ.231.40 కోట్లు మంజురు చేయాలని వినతి కోరారు. ఎన్హెచ్ ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతోపాటు కేంద్రం నుంచి రావల్సిన వాటా మొత్తాన్ని 2023, అక్టోబరు నుంచి తామే విడుదల చేస్తున్నామని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. ఎన్ హెచ్ ఎం కింద తెలంగాణకు రావల్సిన పెండింగ్ నిధులు సత్వరమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.