Air Ambulance | మెరుగైన చికిత్స నిమిత్తం రోగిని తరలిస్తున్న ఓ ఎయిర్ అంబులెన్స్ ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయింది. జార్ఖండ్లోని చత్రా జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
జార్ఖండ్ లతేహార్ జిల్లాకు చెందిన సంజయ్ కుమార్(42) ఈ నెల 16న 65 శాతం కాలిన గాయాలతో రాంచీలోని దేవ్కమల్ ఆస్పత్రిలో చేరారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండడంతో, మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీకి తరలించాలని వైద్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో రోగితో సహా వైద్యులు, సహాయకులు కలిసి రెడ్బర్డ్ ఎయిర్వేస్ ప్రయివేటు లిమిటెడ్కు చెందిన బీచ్క్రాఫ్ట్ సీ90 ఎయిర్ అంబులెన్స్లో రాంచీ నుంచి ఢిల్లీకి సోమవారం రాత్రి 7.11 గంటలకు టేకాఫ్ అయ్యారు. టేకాఫ్ అయిన 20 నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. సిమారియా ఏరియాలో సోమవారం రాత్రి 7.30 గంటలకు కుప్పకూలింది. విమానంలో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో రోగి సంజయ్ కుమార్, ఇద్దరు సహాయకులు, డాక్టర్, పారామెడికల్ ఉద్యోగి, ఇద్దరు పైలట్లు ఉన్నారు.
మృతులు వీరే..
కెప్టెన్ వివేక్ వికాస్ భగత్
కెప్టెన్ సవ్రాజ్దీప్ సింగ్
సంజయ్ కుమార్(రోగి)
డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా
సచిన్ కుమార్ మిశ్రా
అర్చన దేవి
ధురు కుమార్
